ధర్మారం, ఫిబ్రవరి4: సామాన్యులకు సత్వర న్యాయమందించే లక్ష్యంతో ప్రభుత్వం నందిమేడారంలో జూనియర్ సివిల్కోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించిం ది. 2022 నవంబర్ 26న రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గ్రామంలోని పెద్దపల్లి వెళ్లే రోడ్డు మార్గం బైపాస్ మూలమలుపు వద్ద కోర్టు ఏర్పాటు కోసం అద్దె భవనాన్ని తీసుకున్నారు. ఈ తాత్కాలిక భవనంలో జడ్జి చాంబర్తో పాటు ప్రత్యేక హాల్ను ఏర్పాటు చేశారు. అవసరం మేరకు ఫర్నిచర్ను సిద్ధం చేశారు. భవనానికి పెయింటింగ్ వేశారు. కోర్టు సిబ్బంది కోసం అన్ని వసతులు కల్పించారు. ఇక్కడి కోర్టులో ప్రత్యేక జడ్జిని నియమించారు. ఇక్కడే సివిల్, క్రిమినల్ కేసులు విచారణ చేపట్టనుండగా మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు చిన్నాచితక కేసుల విచారణ కోసం పెద్దపల్లికి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు నందిమేడారంలోనే న్యాయసేవలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉన్నదని చెబుతున్నారు.
కోర్టు మంజూరు చేసిన సర్కారుకు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు. కాగా, కోర్టు ప్రారంభానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం నందిమేడారం గ్రామానికి చెందిన హైకోర్టు జడ్జి పొనుగోటి నవీన్రావు, పెద్దపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాగరాజు, జిల్లా సీనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం.అర్జున్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాయిపాటి సురే శ్బాబు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు.
ధర్మారం మండలం నందిమేడారంలో నేటి నుంచి న్యాయ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ కోర్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవం చేయనున్నారు. హైకోర్టు జడ్జిలు పోనుగోటి నవీన్రావు, ఎన్వీ శ్రవణ్ కుమార్ అతిథులుగా హాజరుకానున్నారు. పెద్దపల్లి జిల్లా కోర్టు జడ్జిలు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.