ధర్మారం, ఫిబ్రవరి 5: న్యాయవ్యవస్థ మరింత కట్టుదిట్టంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ సూచించారు. ఆదివారం ధర్మారం మండలం నంది మేడారంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు పొనుగోటి నవీన్ రావు, శ్రవణ్కుమార్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన అద్దె భవనంలో ఏర్పాటు చేసిన కోర్టు శిలాఫలకాన్ని, జడ్జి చాంబర్ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాగా, సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించగా, జిల్లా చీఫ్ జస్టిస్ నాగరాజు సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ మాట్లాడారు. ప్రజల్లో న్యాయ వ్యవస్థపై మరింత గౌరవం పెంచేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని పేర్కొన్నారు. తనకు తెలుగు భాషపై ఎంతో మమకారం ఉందన్నారు. మాజీ సీఎం ఎన్టీఆర్ మాట్లాడిన తెలుగు ఎంతో ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా ఉండేదని గుర్తు చేసుకున్నారు.
క్షేత్ర స్థాయిలో న్యాయవ్యవస్థలో స్థానిక భాష ఉపయోగిస్తేనే న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత చేరువవుతుందని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నరసింహ ఇటీవల న్యాయ పుస్తకాలను తెలుగులో ముద్రించారని ప్రశంసించారు. నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించుకోవడం చరిత్రాత్మకమని, దీని వల్ల ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నంది మేడారానికి చెందిన హైకోర్టు జడ్జి నవీన్రావుపై ఉన్న మమకారంతో న్యాయమూర్తులంతా ఈ కోర్టు ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా కోర్టుల పరిధిలో 16,465 పెండింగ్ కేసులు ఉన్నాయని, పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అందాలని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తి పొనుగోటి నవీన్రావు మాట్లాడుతూ, కోర్టుల్లో కేసులు సుదీర్ఘంగా పెండింగ్లో ఉండడం వల్ల ఎవరికీ న్యాయం జరుగదని, సత్వరం పరిష్కరించి, ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు సమష్టి కృషి జరుగాలని పిలుపునిచ్చారు.
మరో న్యాయమూర్తి ఎన్వీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, పెండింగ్ కేసుల పరిష్కారానికి సాంకేతికతను వినియోగిస్తూ నూతన కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు జిల్లా కోర్టు నుంచి 1,013 కేసులు బదిలీ చేస్తామని వెల్లడించారు. అనంతరం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో పాటు న్యాయమూర్తులు నవీన్రావు, శ్రవణ్కుమార్ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యాయవాదులు, నంది మేడారం సర్పంచ్ సామంతుల శంకర్, ఎంపీటీసీలు కట్ట సరోజ, మిట్ట తిరుపతి, ఉప సర్పంచ్ కట్ట రమేశ్ సన్మానించారు. సమావేశంలో పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్బాబు, కార్యదర్శి సెక్రటరీ భాస్కర్ పాల్గొన్నారు. కాగా, అంతకుముందు పెద్దపల్లి జిల్లా చీఫ్ జస్టిస్ ఎం నాగరాజు, సీనియర్ సివిల్ జడ్జి ఎం అర్జున్, కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ సురేశ్ కలిసి చీఫ్ జస్టిస్కు ఘన స్వాగతం పలికారు.