అభివృద్ధే లేకుంటే అవార్డులు ఎట్లొస్తయ్
ఎప్పుడూ అభివృద్ధిపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు ఒకసారి వెళ్లి పచ్చదనంతో కళకళలాడుతున్న పల్లెలను కండ్లు తెరిచి చూడాలి. నేను ఎంత అభివృద్ధి చేశానో తిమ్మాపూర్ మండలానికి వచ్చిన మూడు జాతీయ అవార్డులే చెప్తయ్. తిమ్మాపూర్ మండలం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచి 1.75కోట్ల నగదు అవార్డు పొందింది. అభివృద్ధి లేనిదే అవార్డులు ఎలా వస్తయ్. ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్కు, బీజేపీ ఏలుతున్న రాష్ట్రాలకు ఎన్ని అవార్డులు వచ్చినయ్. నిత్యం జిల్లా, రాష్ట్ర అభివృద్ధి గురించే ఆలోచించే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను ఓడించి, యువతను ఆగం చేసేటోళ్లను గెలిపించుకున్నం. ఈ తప్పు మరోసారి జరుగకూడదు. ప్రస్తుత ఎంపీ తంబాకు తప్ప మరేం ఇవ్వరు. నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని మరోసారి ఆశీర్వదించాలి.
-రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ దేశంలో చరిత్ర సృష్టించబోతున్నదని, మున్ముందు బీజేపీకి చుక్కలు చూపించబోతున్నదని జిల్లా ఇన్చార్జి బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటున్నదని, ఇది మనం చెప్పుకోవడం గర్వకారణమన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్లో మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయసమ్మేళనం గురువారం నిర్వహించగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ఆయన హాజరై దిశానిర్దేశం చేశారు.
-తిమ్మాపూర్, ఏప్రిల్ 20
ఎన్నికలకు సిద్ధం కావాలి
మరో నాలుగు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నయ్. ప్రతీ కార్యకర్త అందుకు సిద్ధం కావాలి. ప్రతిపక్ష పార్టీల నేతలు కొట్టుకోవడానికే సరిపోయింది. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం పనికొచ్చే ఒక్క పథకమైనా తెచ్చిందా? గతంలో నియోజకవర్గాన్ని పాలించిన కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందో కవ్వంపల్లే చెప్పాలి. నియోజకవర్గ ప్రజలే తమ ఆత్మీయులుగా చూసుకుంటూ ఇంటింటికీ వెళ్లి సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను ఇస్తూ మంచిచెడులను చూసుకుంటున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను మరోసారి ఆశీర్వదించాలి. కాళేశ్వరం నీటిని కాలువల ద్వారా తీసుకువచ్చి, నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత రసమయిదే. ప్రతి గ్రామంలో మహిళా భవనాలు, కులసంఘ భవనాలు నిర్మించిన్రు. జిల్లాలో 60వేల సభ్యత్వాలతో పెద్దసంఖ్యలో కార్యకర్తలను కలిగి ఉన్నం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరూ అలర్టుగా ఉండాలి. ప్రతిపక్ష నాయకుల ఆరోపణల్ని తిప్పికొట్టాలి. రాష్ట్రంలో 60లక్షల సభ్యత్వాలున్నయ్. సోషల్మీడియోలో కల్లిబొల్లి కబుర్లు చెప్పే వారిని దీటుగా సమాధానం ఇవ్వాలి. మన ఎంపీని చూసి సిగ్గుపడాలి.
-జీవీ రామకృష్ణారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు
తిమ్మాపూర్, ఏప్రిల్ 20 : కార్యకర్తల సంక్షేమానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నదని, రూ.రెండు లక్షల బీమా ఇచ్చి కుటుంబాలకు అండగా ఉంటున్నదని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య భరోసా ఇచ్చారు. పార్టీలో కార్యకర్తలకు ఎంతో ఆత్మగౌరవం ఉంటున్నదని, కార్యకర్తలుగా చెప్పుకోవడం మనకు గర్వకారణమన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ దేశంలోనే చరిత్ర సృష్టించబోతున్నదని, బీజేపీకి చుక్కలు చూపించబోతున్నామని చెప్పారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండల ఆత్మీయ సమ్మేళనం గురువారం నిర్వహించగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత రోజురోజుకూ విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా ఆదరణ వస్తున్నదని చెప్పారు. పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుదని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే రసమయి ఆధ్వర్యంలో పార్టీ ఎంతో పటిష్టంగా ఉందన్నారు.
ఎమ్మెల్యేగా ఆయన దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఇంట్లో చుట్టాలం అందరం కలిసి పండుగ చేసుకున్నంత ఆనందంగా ఆత్మీయ సమ్మేళనం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో నాయకులు ఆత్మీయంగా గడిపారు. అనంతరం భోజనాలతో కార్యక్రమం ముగించారు. అంతకుముందు కొత్తపల్లి స్టేజీ నుంచి ఎమ్మెల్యేకు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, కళాకారుల ఆటపాటలు, మహిళల కోలాటాలతో సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను నాయకులు ఘనంగా సన్మానించారు. సభలో పలువురు నాయకులు, కార్యకర్తలు మాట్లాడారు. తమ అనుభవాలను కార్యకర్తలతో పంచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీటీసీ ఇనుకొండ శైలజ, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఇనుకొండ జితేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ బూడిద ప్రేమలత, మాజీ జడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ ఏకానందం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనితాఆంజనేయులు, నాయకులు బోయిని కోమురయ్య, ల్యాగల వీరారెడ్డి, స్వామిరెడ్డి, దుండ్ర రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
అడుగకముందే వరాలిచ్చే నాయకుడు
మానకొండూర్ నియోజకవర్గం నేను ప్రాతినిధ్యం వహించాక ఎంతో మార్పు కనిపిస్తున్నది. ఇంటింటికీ తాగు నీరు, 15వేల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించి పచ్చగా మార్చిన ఘనత మాదే. మండుటెండల్లో సైతం కుంటల్లో నీళ్లు నిండుగా ఉన్నయ్. చేపలు మస్తుగున్నయ్. ప్రతి గ్రామంలో కులసంఘ భవనాలను నిర్మించినం. గోదావరి నీటిని తీసుకొచ్చిన ఘనత మాదే. వృద్ధులకు 2వేల పింఛన్ ఇచ్చి వారి చివరి క్షణాలకు భరోసా ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మండలంలో 1.53కోట్లు నెలకు ఆసరా పింఛన్లు వస్తున్నయ్. దేవున్ని పూజిస్తే వరాలు వస్తాయో రావో.. కానీ, సీఎం కేసీఆర్ అడగకముందే మనకు వరాల జల్లులు కురిపిస్తున్నరు. కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాక ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కలిగింది. నా చెల్లె పెండ్లి చేసేందుకు నా తల్లి చాలా కష్టపడింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రావద్దనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి ఇస్తున్నరు. పూర్వకాలంలో భూములు ఉన్నవారి నుంచి శిస్తు వసూలు చేసేటోళ్లు. కానీ, మన రాష్ట్రంలో రైతుబంధు ద్వారా పెట్టుబడికి రైతులకు ప్రభుత్వం సాయం చేస్తున్నది.
-రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే
మహిళల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు మహిళల అండదండలు ఉన్నయ్. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్నది. నియోజకవర్గ విద్యార్థుల కోసం స్థలం చూపిస్తే 30లక్షలతో పక్కా భవనం, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అందుబాటులో ఉంచుతాం. నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయలో పడకుండా ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలు సాధించాలి. నాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులకు గొప్పస్థానాన్ని ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు.
-పొన్నం అనిల్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
పార్టీని మరింత బలోపేతం చేస్తాం
రసమయి బాలకిషన్ ఎమ్మెల్యే అయిన తర్వాత మండలం ఎంతో అభివృద్ధి చెందింది. ఏ గ్రామానికి ఏం కావాలో తెలసుకుని పని చేస్తున్న నాయకుడు ఆయన. ఏ కార్యకర్తకు సమస్య ఉన్నా నేనున్నా అని అండగా నిలిచే ఎమ్మెల్యేకు మనం ఎల్లవేళలా రుణపడి ఉండాలి. ఒకసారి మనమంతా ఆత్మీయంగా కలుసుకోవాలనే పార్టీ సూచన మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తాం.
-రావుల రమేశ్, బీఆర్ఎస్ తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు
దీటుగా జవాబివ్వాలి..
మనం మంచిగా ఉంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు రెచ్చిపోతున్నరు. ఎవరికీ భయపడాల్సిన పని లేదు. విమర్శలకు ప్రతివిమర్శ చేయాలి. పార్టీని, మనల్ని కాపాడుకునేందుకు ఎమ్మెల్యే ఉన్నరు. అన్నకు ప్రతీ ఒక్క కార్యకర్తా కుటుంబసభ్యుడే. ఎవరికి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. కార్యకర్తలే పార్టీకి పునాదులు కాబట్టి అందరూ సంక్షేమంగా ఉండడానికి కృషి చేస్తం.
-కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు
అందరం కలిసికట్టుగా ఉండాలి.
పార్టీ అంటే ఒక కుటుంబం. ప్రతీ నాయకుడు, కార్యకర్త ఒక కుటుంబంలా కలిసికట్టుగా ఉండి, పార్టీని బలపర్చుకోవాలి. అలా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఏ కార్యకర్తకు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించాలి. పార్టీని అభివృద్ధి చేసుకోవాలి. నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ ఉంది. మరింత తిరుగులేకుండా ముందుకు సాగాలి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించి, లబ్ధి చేకూరేలా చేయాలి.
-ఇనుకొండ జితేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు
బీఆర్ఎస్ గొప్ప పార్టీ
నా లాంటి సామాన్య దళిత బిడ్డను 50ఏండ్ల చరిత్ర గలిగిన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ను చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ది. పార్టీని నమ్ముకుని ఉంటే ఎన్నటికైనా న్యాయం జరుగుతుందనడానికి నేనే ఉదాహరణ. మహిళలకు సముచిత స్థానం కల్పించే పార్టీ బీఆర్ఎస్. ఇలాంటి పార్టీకి మనందరం కార్యకర్తలం అయినందుకు గర్వంగా ఉంది. మరోసారి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరమున్నది. సామాన్యుల కోసం పరితపించే బీఆర్ఎస్కు మనమంతా అండగా ఉండాలి.
– ఎలుక అనిత, కరీంనగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్