సారంగాపూర్, డిసెంబర్ 23: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆ యువకుడికి లాటరీ రూపంలో జాక్పాట్ తగిలింది. ఏకంగా రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన యువకుడు ఓగుల అజయ్ని ఈ అదృష్టం వరించింది. ఓగుల దేవరాజం-ప్రమీల దంపతులకు ఇద్దరు కొడుకులు అజయ్, రాకేశ్, కూతురు రమ్య ఉన్నారు. తండ్రి దేవరాజం మృతి చెందడంతో నాలుగేండ్ల కిందట ఉపాధి కోసం అజయ్ దుబాయ్ వెళ్లాడు.
అక్కడ ఓ గోల్డ్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అజయ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న ఎమిరేట్స్ కంపెనీకి చెందిన రెండు లాటరీ టికెట్లను రూ.15 చొప్పున కొనుగోలు చేశాడు. ఈ నెల 16న తీసిన డ్రాలో 15 మిలియన్ల దిర్హామ్స్ గెలుచుకున్నాడు. ఇండియా కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.33 కోట్లు ఉంటుందని, పన్నులు పోగా రూ.30 కోట్లు చేతికి వస్తాయని అజయ్ చెప్తున్నాడు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో తమ కుటుంబ కష్టాలన్నీ పరిష్కారమవుతాయని ఆ యువకుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.