జగిత్యాల కలెక్టరేట్, ఫిబ్రవరి 15 : జగిత్యాల జిల్లా కేంద్రం శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు సమకూర్చు కునేందుకు టీయూఎఫ్ఐడీసీ నిధులు మంజూరు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అసెంబ్లీలో కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమ నియోజకవర్గానికి 4520 డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించగా, వాటి నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని, ఆ కాలనీలో తాగు నీటి వసతిని ఏర్పాటు చేశామని, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరయ్యాయన్నారు.
అయితే, టీయూఎఫ్ఐడీ నిధులను వీటికి కేటాయించరాదనే నిబంధన దృష్టికి వచ్చిందని, జగిత్యాల పట్టణ పేదరిక నిర్మూలన కోసం కేటాయించిన కాలనీ కనుక టీయూఎఫ్ఐడీసీ నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా గతంలో మంజూరు చేసిన ప్రొసీడింగ్ల ద్వారా కొందరు నిరుపేదలు ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించారని, వీరిని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చేర్చి నిధులు మంజూరు చేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఎమ్మెల్యేలకు కేటాయించిన విధంగా ఏసీడీపీ నిధులు మంజూరు చేయాలని, స్థానిక ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ అమలు చేయాలని సభ ద్వారా స్పీకర్ను కోరారు.