ధర్మపురి, మే 20: బుగ్గారం మండలం గోపాల్పూర్లో ఈ నెల 16న జరిగిన అన్నదమ్ముల హత్యకేసును పోలీసులు ఛేదించారు. సోమవారం ఏడుగురి నిందితులను అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప పైపులు, కర్రలతో పాటు కారు, రెండు బైక్లు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ సోమవారం ధర్మపురి సర్కిల్ ఆఫీసులో హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. గోపాల్పూర్కు చెందిన దీటి తార కొడుకు శ్రీనివాస్ తమ బంధువైన నాగుల అంజయ్య వద్ద 2018లో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు.
అయితే అదే ఇంటిని 2017లోనే అంజయ్య కొడుకు రాజేశ్ వద్ద నుంచి తాము కొన్నామని తార కొడుకు శ్రీనివాస్తో అదే గ్రామానికి చెందిన బుర్ర లక్ష్మి, ఆమె కొడుకులు నాగరాజు, నవీన్ గొడవకు దిగారు. ఈ క్రమంలో లక్ష్మి కోర్టును ఆశ్రయించగా, 2023లో ఈ కేసును కొట్టేసింది. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చాయి. అయితే జగిత్యాలలో ఉంటున్న లక్ష్మి, తన కొడుకులు నాగరాజు, నవీన్తో కలిసి ఈ నెల 12న ఎల్లమ్మ పండుగ కోసం గోపాల్పూర్కు వచ్చింది. 16న ఎల్లమ్మ పట్నాలు ముగిసిన తర్వాత నాగరాజు, నవీన్ ఇంటికి వెళ్తున్న సమయంలో తార, శ్రీనివాస్, శ్రీనివాస్కు వరుసకు తమ్ముడైన మహేశ్తో కలిసి ఇంటి ఎదుట పడుకున్నారు.
అప్పటికే క్షక్ష పెంచుకున్న నవీన్ ఇదే అదనుగా రాకపోకలకు ఇబ్బంది అవుతున్నదని వారితో గొడవకు దిగాడు. చుట్టుపక్కల వారు ఇరువర్గాల వారిని సముదాయించారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన నవీన్ మాత్రం శ్రీనివాస్, మహేశ్ను హతమార్చాలని నిర్ణయించుకొని, అదేరోజు రాత్రి జగిత్యాలకు చెందిన తన స్నేహితులు జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేశ్, నాచుపల్లి గంగరాజం, చింతల శేషు, చొప్పరి అజయ్కి ఫోన్చేసి గ్రామానికి రప్పించాడు.
వీరందరూ హత్యకు పథకం రూపొందించారు. రాత్రి 11.30 గంటలకు తార ఇంటికి వెళ్లి శ్రీనివాస్, మహేశ్పై ఇనుప పైపులు, కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా, మహేశ్ వరంగల్ ఎంజీఎంలో కన్నుమూశాడు. దాడి తర్వాత నిందితులు వారు వెంట తెచ్చుకున్న వాహనాల్లో పరారయ్యారు. సోమవారం బుగ్గారం ఎక్స్ రోడ్డు వద్ద సీఐ రాంనర్సింహారెడ్డి నేతృత్వంలో ఎస్ఐలు శ్రీధర్రెడ్డి, ఉదయ్కుమార్ వాహనాలు తనిఖీ చేస్తుండగా.. నిందితులు వారి వాహనాల్లో వెళ్తూ పట్టుబడ్డారు. వారిని రిమాండ్కు తరలించారు. సమావేశంలో గొల్లపెల్లి, వెల్గటూర్ ఎస్ఐలు సతీశ్, ఉమాసాగర్ ఉన్నారు.