జగిత్యాల కలెక్టరేట్, అక్టోబర్ 30: ‘ నా రాజకీయ జీవితంలో మున్నూరు కాపులు అందించిన అండదండలు, ఆదరణ మరువలేను. మీ సేవ కోసమే అహర్నిశలూ కృషిచేస్తున్న. నా వెన్నంటి నిలిచిన మీకు బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో ప్రాధాన్యమిచ్చాం’ అని జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలే తన వారసులని, ఎల్లవేళలా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. 2014, 2018లో తన వెంటే ఉన్నారని, 2023లో కూడా వెన్నంటి ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని మున్నూరు కాపులకు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు.
ఈ సమ్మేళనానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మున్నూరుకాపులు తన వెంటే నడిచారని, అప్పుడు ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ చాలా బూత్లలో అత్యధిక మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. మున్నూరు కాపులు ఎక్కువగా ఉండే బూత్లలో మెజార్టీ రావడంతో కాంగ్రెస్ నాయకులే అవాక్కయ్యారని చెప్పారు. 218 బూత్ నంబరులో 95 శాతం ఓట్లు తనకు పోలవ్వడంతో కాంగ్రెస్ నాయకుడు జీవన్రెడ్డే పరేషాన్ అయ్యాడని తెలిపారు. 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేయగా, నియోజకవర్గం మొత్తంలో కాపులు తన వెన్నంటి ఉండి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. దావ వసంతను జడ్పీటీసీగా గెలిపించి జడ్పీ చైర్పర్సన్ను చేశామని, ఇలా ఎంతో మంది కాపు బిడ్డలకు బీఆర్ఎస్ హయాంలో తగిన న్యాయం చేశామన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో కాపులే ఎక్కువ శాతం లబ్ధిపొందుతున్నారన్నారు. 2014, 2018లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామని స్పష్టం చేశారు. వంద పడకల మాతా శిశు దవాఖాన, మెడికల్ కళాశాలను కూడా ఏ ర్పాటు చేశామని తెలిపారు. మెడికల్ కళాశాల స్థ లం గురించి ఎంతో మంది రాజకీయం చేసి మోకాలడ్డే ప్రయత్నం చేశారని వాపోయారు. ఎక్కడెక్కడి నుంచో వైద్యం కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎస్సారెస్పీ భూముల్లో కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ఆగ్రోస్ స్థలంలో కాంగ్రెస్ నాయకులు మల్టీఫ్లెక్స్ కట్టేందుకు యత్నించారని, కానీ ప్రజా అవసరాల కోసం తాను ఈ భూముల్లో మెడికల్ కళాశాలను నిర్మించానని చెప్పారు. జిల్లా కేంద్రం అయినందున విద్యార్థులకు వసతి సౌకర్యం, కమ్యూనిటీ భవనాల కోసం స్థలాల సేకరణకు యత్నిస్తుంటే కొందరు నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ భవనాలకు, విద్యార్థుల వసతికి భూములు వద్దని సదరు నాయకుడు చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో 40 గ్రామాల్లో రూ1.40 కోట్లతో కమ్యూనిటీ భవనాలు మంజూరు చేశానన్నారు.
-జడ్పీ చైర్పర్సన్ దావ వసంత
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, 24 గంటల నిరంతర విద్యుత్ వంటి పథకాలతో మున్నూరు కాపులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సంతోషం వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో సాగు నీరు లేక, కరెంట్ రాక పంట భూములన్నీ పడావులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల ఇండ్లకు పిల్లనిచ్చేందుకు వెనుకాడేవారని వాపోయారు. కానీ 2014 తర్వాత సీన్ మొత్తం మారిందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో భారీ నీటి ప్రాజెక్టులు నిర్మించి, చెరువులు తవ్వించడంతో చెరువులు, బావుల్లో పుష్కలంగా నీరు చేరిందని తెలిపారు. వ్యవసాయానికి నిరంతరంగా 24గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడం, పంట సాయం కింద ఎకరాకు రూ. 10 వేలు ఇస్తుండడంతో నేడు ప్రతీ ఎకరా పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందన్నారు.
జిల్లా కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించిన మున్నూరు కాపులు అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో మున్నూరు కాపు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు, సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.