జగిత్యాల : పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు జీవోలను విడుదల చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapally Vinod Kumar) డిమాండ్ చేశారు. మేడిపల్లి మండలం పొరుమల్ల గ్రామంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్లు దండుకునేందుకే కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని ఆరోపించారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.
ఆరు గ్యారెంటీల (Six guarantees) లో ఇప్పటి వరకు ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం 33శాతం మాత్రమే పూర్తి అయిందని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం(MahaLakshmi) లో మూడు ఉప గ్యారెంటీలు ఉన్నాయని రూ. 500 లకే సిలిండర్, ప్రతి మహిళలకు రూ. 2,500 పెన్షన్ వంటి హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
వారం, పది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల(Parliamentary elections) కోడ్ వచ్చే అవకాశం ఉందని, కోడ్ పేరుతో రేవంత్రెడ్డి సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి క్వింటాలుకు రూ. 500ల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, కనీస మద్దతు ధర కంటే తక్కువ వస్తేనే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరామ్ రెడ్డి ప్రకటించడం శోచనీయమని అన్నారు.