జగిత్యాల కలెక్టరేట్, డిసెంబర్ 9: కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు వద్దని, దీనిపై ప్రజల సందేహాలను వైద్యాధికారులు, సిబ్బంది నివృత్తి చేయాలని కలెక్టర్ జి.రవి ఆదేశించారు. కొవిడ్ టీకా ప్రక్రియపై వైద్యాధికారులు, మండల ప్రత్యేకాధికారులతో కలెక్టర్ గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే కొవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో వంజరివాడ సంఘ భవనం, దేవీశ్రీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రక్రియ వందశాతం పూర్తయ్యే వరకూ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి వరకు కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. మొదటి, రెండో విడుత వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొని పనిచేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని వంజరి వాడ సంఘ భవనం, దేవీశ్రీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. టీకాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరు, వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి వివరాలు తెలుసుకున్నా రు. కొవిన్ యాప్లో వివరాల నమోదు, రిజిస్ట్రేషన్ అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మాధురి, జిల్లా వైద్యాధికారి శ్రీధర్, మండల ప్రత్యేకాధికారి రాజేశ్వర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.