Jagtial : సోషల్ మీడియాలో విదేశీ ఉద్యోగ ప్రకటనకు ఆకర్షితుడై నెలకు రూ.70 వేలు సంపాదించి అప్పులు తీర్చవచ్చనే ఆశతో కంబోడియా వెళ్లిన ఓ యువకుడు అనూహ్యంగా అక్కడే చిక్కుకుపోయాడు. తిండికి, వసతికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న అతడు స్వదేశానికి వద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న తన భర్తను భారత్కు తీసుకొచ్చేందుకు సాయం చేయాలని అతడి భార్య సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్న మెటుపల్లికి చెందిన దువ్వాక రాజేష్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసం కంబోడియా వెళ్లాడు. ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లిన అతడు సైబర్ నేరస్తుల ముఠా చేతిలో బందీ అయ్యాడు. ఎలాగోలా పాస్ పోర్ట్తో సహా వారి చెర నుంచి బయట పడిన రాజేష్ ప్రస్తుతం అక్కడ మూడు పూటలా తిండికి, వసతికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తిరిగి స్వదేశానికి రావాలంటే రూ. 1.20 లక్షలు చెల్లించాలని రాజేష్కు కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం సిబ్బంది స్పష్టం చేశారు. దాంతో తన భర్త
రాజేష్ను సురక్షితంగా కంబోడియా నుంచి భారత్కు తీసుకురావాలని అతని భార్య ప్రవళిక రాణి ప్రాధేయపడుతోంది. శుక్రవారం హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్లో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ఆమె ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీం రెడ్డికి ప్రవళికా రాణి వినతిపత్రం ప్రతిని పంపించింది. ప్రవాసీ ప్రజావాణి వాలంటీర్ భార్గవి నద్దునూరి ఆమెకు మార్గదర్శనం చేశారు.
కంబోడియాలో ఉద్యోగం కోసం వెళ్లిన దువ్వాక రమేష్ అక్కడ చిక్కుకుపోయిన విషయాన్ని అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఎప్రిల్ 4న ‘మదద్’ (భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన ఫిర్యాదుల నమోదు, పర్యవేక్షణ వ్యవస్థ) పోర్టల్లో నమోదు చేసి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది.