Koppula Eshwar : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడానికి గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉద్యమ ప్రణాళికను ఖరారు చేయడంతో పాటు కొప్పుల నేతృత్వంలో క్షేత్రస్థాయి నిరసనలకు సమాయత్తం కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనుంది.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ ఉద్యమ ప్రణాళికను ఖరారు చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 8 రోజుల పాటు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను కొప్పుల వివరించారు. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, మహిళలకు, నిరుద్యోగ భృతి.. వంటి నెరవేరని వాగ్దానాలపై నిలదీయాలని పార్టీ నేతలు, కార్యకర్తలను ఆయన కోరారు.
ధర్మపురి నియోజకవర్గంలో నిలిచిపోయిన మౌలిక వసతులు, ఉపాధి రహిత సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటం చేయాలని ఆయన సూచించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రతి ఇంట్లోనూ, గ్రామంలోనూ ప్రజలను చైతన్య పరచాలని కొప్పుల పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఈ నిరసన ఉద్యమం ధర్మపురి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతటి ప్రభావం చూపనుందని ఆయన వెల్లడించారు. రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలోనూ ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వాన్ని నిలదీసేలా ముమ్మర కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి ఆదేశాంచారు.

పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శకంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల నాయకత్వంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.