– జగిత్యాల, మార్చి 21 :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థులను యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో యువ విజ్ఞాన కార్యక్రమాన్ని (యువికా) ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఇందుకు ఏప్రిల్ 10 వరకు గడువు విధించింది. ఎంపికైన వారికి మే 16 నుంచి 28 వరకు దేశంలోని షార్కు అనుబంధంగా ఉన్న సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నది.
విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ‘భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ’ (ఇస్రో) అవకాశం కల్పిస్తోంది. యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఎంపికైన వారికి వేసవి సెలవుల్లో మే 16 నుంచి 28 వరకు రెసిడెన్షియల్ పద్ధతిలో ట్రైనింగ్ ఇవ్వనున్నది. హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, ఉండడానికి, భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలను ‘ఇస్రో’ కల్పించనున్నది. విద్యార్థితో పాటు తల్లితండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీశ్దావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు.
దరఖాస్తు విధానం..
విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
.మొదట వారి ఈ-మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
.రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల్లో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి.
.క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత ‘యువికా’ పోర్టల్లోని ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి.
.అర్జీతో పాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, విద్యార్థి మూడేళ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి
.దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 10 నుంచి ఏప్రిల్ 10 వరకు అవకాశం కల్పించారు. ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 20న ప్రకటించి వారికి సమాచారం అందిస్తారు.
ఎంపిక విధానం…
ప్రస్తుతం 9వ తరగతి (2021-22) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గ్రామీణ విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. 8వ తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్ ప్రతిభ పరీక్ష, ఒలింపియాడ్లో పాల్గొని మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిస్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన వారు, స్కౌట్స్, ఎన్సీసీలో సభ్యులుగా ఉండడం ఆన్లైన్ క్విజ్లో ప్రతిభ చూపిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది.
శిక్షణ కేంద్రాలు..
1. విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్, తిరువనంతపురం
2. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, బెంగళూర్
3. స్పేస్ ఆప్లికేషన్ సెంటర్, ఆహ్మదాబాద్
4. నేషన్నల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్
5. నార్త్-ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్
హెచ్ఎంలు అవగాహన కల్పించాలి
అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేకాధికారులు ఈ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ప్రతిభ ఉన్న వారిని గుర్తించి దరఖాస్తు చేసుకొనేలా ప్రోత్సహించాలి. అవసరమైతే వారి తల్లిదండ్రులకు సైతం విడమర్చి చెప్పాలి. ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– బీ జగన్మోహన్రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి (జగిత్యాల)
విద్యార్థులకు మంచి అవకాశం
యువికా ద్వారా అందించే శిక్షణ విద్యార్థులకు మంచి అవకాశం. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇస్రో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సైన్స్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేలా అర్హత గలవారిని ప్రోత్సహించాలి. అవసరమైతే తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలి.
– బాజోజి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి (జగిత్యాల)