గొల్లపల్లి, జూలై 3: రైతులు అనాదిగా సంప్రదాయ పంటలే వేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ను బట్టి కాకుండా పాతకాలం నాటి సేద్య విధానాలే పాటిస్తున్నారు. ఫలితంగా లాభం వస్తే తీసుకుంటున్నారు.. లేదంటే నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన సర్కారు మార్కెట్లో డిమా ండ్ ఉన్న ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ఆయిల్పామ్ సాగును విస్తరించాలని నిర్ణయించింది. వరి సాగు చేస్తున్న రైతులను ఇతర పంటలపైకి మళ్లించడానికి ప్రభుత్వం 90శాతం సబ్సిడీతో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో జిల్లాలో అధికార యంత్రాంగం గ్రామా ల్లో అవగాహన కల్పించి చైతన్యం తెచ్చింది.
అబ్బాపూర్లో 50ఎకరాల్లో నర్సరీ
జగిత్యాల జిల్లాలో 10,260 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళికలు రూపొందించింది. 5.35లక్షల ఆయిల్ పామ్ సీడ్ను మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి తెప్పించింది. గొల్లపల్లి మండలం అబ్బాపూర్లో మొక్కల పెంపకానికి 50ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకొని లోహియా, ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గోల్డ్ డ్రాప్) కంపెనీ మొక్కలను పెంచుతున్నది. అందులో ఎకరంన్నరలో షెడ్ నెట్ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతుంది. గత మార్చి 14న షెడ్ నెట్లో ఆయిల్ ఫామ్ విత్తనాలను విత్తారు. 90రోజుల వరకు తుంపర సేద్యం ద్వారా నిపుణుల పర్యవేక్షణలో మొక్కలు పెరుగుతున్నాయి. 90రోజుల తర్వాత బయటకు తీసిన మొక్కలను 18కిలోల కవర్ సంచిలో నింపి బయటి వాతావరణానికి అనుకూలంగా మొక్కలను తయారు చేస్తారు. ఆరు నెలల తర్వాత ఆ మొక్క ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత రైతు చేలలో నాటడానికి ప్రణాళికలు రూపొందించారు.
ఒక్కసారి నాటితే 30ఏండ్ల దాకా
ఆయిల్పామ్ సాగులో భారీ లాభాలుంటాయి. ముందుగా మొక్కకు మొక్కకు మధ్య తొమ్మిది మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు 48నుంచి 50దాకా మొక్కలు నాటుకోవచ్చు. ఒక్కో మొక్క ధర మార్కెట్ విలువ రూ.200 ఉండగా రైతుకు సబ్సిడీపై రూ.20కు అందజేయనున్నారు. నాటిన మొక్క నాలుగేళ్ల నుంచి దిగుబడినివ్వడం ప్రారంభమై 30 ఏండ్ల దాకా వస్తుంది. ఒక్కో చెట్టుకు ఏడు నుంచి ఎనిమిది గెలలు వేస్తా యి. నిర్వాహణను బట్టి గెల సైజు 20నుంచి 40కిలోల మధ్య ఉంటుంది. ఒక్కో ఎకరా సాగులో నా లుగేళ్ల తర్వాత రూ.2లక్షల ఆదాయం వస్తుంది. 10నుంచి 16టన్నుల దాకా దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ధర మార్కెట్లో రూ.20వేల నుంచి రూ.23వేల దాకా పలుకుతుంది. ఇందు లో అంతర పంటలుగా మిర్చీ, టమాట, బీర, శ్రీగంధం, పత్తి తదితర మొక్కలను సాగు చేసుకోవచ్చు. వీటికి సైతం ప్రభుత్వం నాలుగేళ్ల దాకా ప్రతియేటా రూ.4200ను అందజేస్తుంది.
సబ్సిడీపై డ్రిప్ పరికరాలు..
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం 90శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలను అందించనుంది. పెద్ద రైతులకు 80 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు గత నిబంధనలను ఈ ఆయిల్ ఫామ్ సాగు కోసం సడలించినట్లు అధికారులు వివరించారు.
కొనుగోలుకు ఇబ్బంది లేదు..
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు వారు పండించిన గెలలను అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మొక్కలను అందించిన గోల్డ్ డ్రాప్ ఆయిల్ కంపెనీయే గెలలు కొనుగోలు చేస్తుంది. ప్రతి 2వేల ఎకరాల సాగుకు ఒక కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి రైతు పంటను తీసుకెళ్తారు.
అడవి జంతువుల బెడద లేదు..
ఆయిల్ పామ్ సాగులో అలాంటి బెడద లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కోతుల బెడద, అడవి పందుల బెడద అసలే లేదు. చీడ పీడలు ఆశించవు.
సలహాల కోసం..
జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్, మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి, సారంగాపూర్, మేడిపల్లి మండలాలకు చెందిన రైతులు వివరాల కోసం ఫీల్డ్ ఆఫీసర్ అన్వేష్ను 800882408 లో సంప్రదించాలి. కోరుట్ల, మెట్పెల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, రాయికల్ మండలాల రై తులు ఫీల్డ్ ఆఫీసర్ బీ రమేశ్ను 8328112218 లో. ధర్మపురి, బుగ్గారం, బీర్పూర్, వెల్గటూర్, గొల్లపల్లి రైతులు ఫీల్డ్ ఆఫీసర్ బీ రాజేశ్ను 967665525లో సంప్రదించాలి. సాంకేతిక సలహాల కోసం ధర్మపురి, చొప్పదండి నియోజక వర్గాల రైతులు ధర్మపురి ఉద్యానవన అధికారి దేవి ప్రసాద్ను 7013681010నంబర్లో సంప్రదించాలి. జగిత్యాల, కోరుట్ల, వేములవాడ నియోజక వర్గాలకు చెందిన రైతులు సాంకేతిక సలహాల కోసం జగిత్యాల ఉద్యానవన అధికారి శ్యాం ప్రసాద్ను 7780239329లో సంద్రించాలి. ఆసక్తి గల రైతులు సరైన ధ్రువీకరణ పత్రాలతో వీరిని సంప్రదిస్తే వచ్చే జనవరి, ఫిబ్రవరిలో డ్రిప్ ఏర్పాటు చేసి అధికారుల పర్యవేక్షణలో ఆయిల్ పామ్ మొక్కలను నాటిస్తామని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్ తెలిపారు.