జగిత్యాల, మే 21, (నమస్తే తెలంగాణ) : శతాబ్దాల పాటు సామాజిక, రాజకీయ, ఆర్థిక దారిద్య్రాన్ని అనుభవించిన దళితులు కోటీశ్వరులు కావాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, అందుకోసం పుట్టిన పథకమే దళితబంధు అని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో 118 మంది దళితబంధు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దళితుల సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్దికి ఇరిగేషన్ రంగమే సజీవసాక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడిన 8 ఏండ్ల కాలంలోనే అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామాగా మారిపోయిందన్నారు. అన్ని విభాగాల్లోనే దేశంలో నంబర్వన్గా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. విజనరీ ఉన్న సీఎం కేసీఆర్తోనే ఈ ప్రగతి సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయని మంత్రి ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు భరోసా యాత్ర పేరిట పెట్టిన సభ, పక్కా అబద్ధాల సభ అని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే అత్యంత సాహసోపేత నిర్ణయాల్లో ఒకటి భూ సంస్కరణలని, ఇందులో భాగంగా అమలు చేసిన ధరణి చట్టాన్ని వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తామని ప్రకటించిందన్నారు. రైతుల కష్టాలను దూరం చేసిన ధరణిని రద్దు చేస్తే, కాంగ్రెస్ పార్టీని ప్రజలు తెలంగాణలో రద్దు చేస్తారన్నారు. దళితబంధు పథకంతో దళితవర్గాలు ఆర్థిక స్వావలంబనను సాధించాలన్నారు.
దళితబంధు పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ప్రతిపక్షాలు దళితులను రెచ్చగొట్టేందుకు యత్నించాయన్నారు. ఇప్పటికే 32వేల కుటుంబాలకు దళితబంధు వర్తింపజేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 17,700 కోట్లు దళితబంధుకు కేటాయించామన్నారు. త్వరలోనే నియోజకవర్గానికి 1500 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు పథకం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందన్నారు. అణగారిన దళిత కుటుంబాలకు ఆసరాగా నిలిచి వారి భవితవ్యాన్ని మార్చివేసేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మహత్తర పథకమే దళితబంధు పథకం అన్నారు. ఈ పథకాన్ని ఆసరాగా చేసుకొని దళితవర్గాలు ఆర్థిక స్వావలంభనను సాధించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీది అధికార యావ అని, టీఆర్ఎస్ పార్టీది అభివృద్ధి బాట అన్నారు. ప్రతిపక్షాలు చేసే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు.
దళితబంధుతో పాటు, వైన్స్, ఫెస్టిసైడ్స్ దుకాణాలు, మందుల దుకాణాలు, పరిశ్రమలు, ఐటీ పరిశ్రమల రంగాల్లో సైతం దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పదిశాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయని, రాష్ట్ర అభివృద్ధిని చెడగొట్టేందుకు యత్నిస్తున్నాయని, వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ద మ్ముం టే, దేశానికే దిక్సూచిలా మారిన దళితబంధును పోలిన పథకాన్ని వారు అధికారంలో ఉన్న రాష్ర్టా ల్లో అమలు చేసి చూపించాలని మంత్రి ఈశ్వర్ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కలెక్టర్ గుగులోత్ రవి, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుందారపు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ప్రగతి పథంలో సాగాలి
ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆర్థికంగా, సామాజికంగా ప్రగతిపథంలో సాగాలి. దళితులు సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించాలి. ఐటీఐతోపాటు ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, ఏసీ మెకానిక్ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు న్యాక్ సెంటర్లు ఉన్నాయి. వాటిని ఆసరాగా చేసుకొని సాంకేతిక నైపుణ్యం పొందాలి. దళితబంధు ద్వారా సాంకేతిక సంస్థలను స్థాపించి ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేయాలి.
– సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
అవినీతికి తావు లేకుండా అమలు
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో దళితులు, అణగారిన వర్గాల కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తెచ్చాయి. ఏ ఒక్కటీ విజయవంతం కాలేదు. ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారుల కంటే దళారులే ఎక్కువ ప్రయోజనం పొందారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం ఆలోచించి ఏకంగా పది లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన సీఎం ఒక్క కేసీఆర్ మాత్రమే. దళితబంధు పథకాన్ని ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం ఏ చర్యలు తీసుకోవడం లేదు. నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వారికి కనీసం మానవత్వం, మంచి మర్యాద లేదు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మద్దు.
– విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే
దళిత బంధు విప్లవాత్మక నిర్ణయం
దళితబంధు పథకం ప్రపంచంలోనే విప్లవాత్మక నిర్ణయాల్లో ఒకటి. దేశంలో అంబేద్కర్ ఆలోచనలు, జగ్జీవన్రాం ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. ఒకప్పుడు దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరయ్యే వి. వీటిని ఇచ్చేందుకు బ్యాంకులు నానా ఇబ్బందులు పెట్టేవి. పట్టుమని పది మందికి సైతం ఏడాదిలో రుణాలు వచ్చేవి కాదు. ఇప్పుడు అందుకు భిన్నంగా పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం అంటే మామూలు విషయం కాదు. దళితబంధుతో కూలీలు, ట్రాక్టర్, కారు డ్రైవర్లు యజమానులు అవుతున్నారు.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
ఆర్థికాభివృద్ధి సాధించాలి
సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు ప్రపంచంలోనే విప్లవాత్మకమైన పథకం. దళితులు ఆర్థికావృద్ధిని సాధించడమే ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాంతంలో ఏ పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఉందో గుర్తించాలి. ఆ పరిశ్రమలను దళితబంధు పథకం ఆధారంగా చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ
ఉన్నత స్థాయికి చేరాలి
దళితబంధు పథకంలో లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరాలి. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతుల అభివృద్ధి కోసం, దళితవర్గాల సంక్షేమం కో సం పాటుపడుతున్న మహానుభావుడు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో ఎందుకు సభలు పెడుతున్నా యో అర్థం కావడం లేదు. వరంగల్ రైతు భరోసా సభ ఒక హాస్యాస్పద సభ. బండి సంజయ్ ఎవరికోసం ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నాడో తెలియ డం లేదు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వడ్లు కొననందుకు, దేశ వ్యాప్తంగా దళితబంధు పథకం లాంటి పథకాన్ని అమలు చేయనందుకు ప్రదాని మోదీ ముందు ధర్నా చేయాలి.
– దావ వసంత, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్