‘దళితబంధు’ యూనిట్ల పంపిణీ పండుగలా సాగుతున్నది. శనివారం జగిత్యాల జిల్లాకేంద్రంలో జాతరను తలపించింది. మినీ స్టేడియం వేదికగా 118 మందికి 11.80 కోట్ల విలువైన యూనిట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ అందించగా, లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. కూలినాలి చేసుకుని బతికే తమకు భరోసా దొరికిందని దళితలోకం సంబురపడ్డది. ముఖ్యమంత్రి కేసీఆర్కు జేజేలు పలుకడమేకాదు నిండునూరేళ్లుగా చల్లంగా ఉండాలని దీవించింది.
జగిత్యాల కలెక్టరేట్/ జగిత్యాల రూరల్, మే 21 : దళిత బంధు పథకం దిగ్విజయంగా అమలవుతున్నది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పక్కా ప్రణాళిక ప్రకారం యూనిట్ల గ్రౌండింగ్ జరుగుతున్నది. ఇప్పటికే వేలాది మందికి మంజూరు చేయగా, శనివారం జగిత్యాల మినీ స్టేడియం వేదికగా 118 మంది లబ్ధిదారులకు 11.80 కోట్ల విలువైన యూనిట్లను రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డాక్టర్ సంజయ్కుమార్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవితో కలిసి అందించారు. 67 మందికి ట్రాక్టర్లు, తొమ్మిది మందికి ప్యాసింజర్ వాహనాలతోపాటు 17 మందికి రిటైల్ షాపులు, 18 మందికి సర్వీస్ విభాగం, ఏడుగురికి మ్యానుఫ్యాక్చర్ విభాగంలో ఆస్తులను అందించారు. దళితబంధుతో తమ బతుకులు మారుతాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులు చేసుకునే తాము ఇప్పుడు ఒనర్లయ్యామని, ఇక తమకు బతుకు దెరువు దొరికిందని సంతోషంగా చెబుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధిస్తామని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కేసీఆర్ దయతోనే ఓనర్నయిన..
నా పేరు అన్నం కొండయ్య. కోరుట్ల మండలం సంగెం గ్రామం. నలుగురు బిడ్డలు, భార్యతో కలిసి మా ఊరైన సంగెంలో ఓ చిన్న కొట్టుపెట్టుకుని బతికేది. నా భార్య అనారోగ్యం బారిన పడడంతో కొట్టును బంద్చేసిన, ఆ తర్వాత కోరుట్లలోని ఓ సేటు దగ్గర కిరాణా దుకాణంలో ఏడేండ్లసంది పనిజేత్తున్న. అప్పోసప్పో జేసి ముగ్గురు బిడ్డల పెండ్లిజేసిన. ఇగ జీవితమంతా గింతే అని అనుకుంటుండేటోన్ని. ఇంతట్లనే సీఎం కేసీఆర్ సార్ దళితబంధును షురూజేసిండు. మా ఎమ్మెల్యే సార్ ఈ పథకానికి నా పేరు రాసిండు. సర్కారు ఇచ్చిన రూ. 10 లక్షలతో ఊరిలోనే కిరాణా దుకాణాన్ని పెట్టుకున్న, కూలీగా పనిచేసే నన్ను ఓనర్ను చేసిన సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
మినీ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న..
తెలంగాణ సర్కారు ఇచ్చిన దళిత బంధు పథకం ద్వారా మినీ సూపర్ మార్కెట్ను పెట్టుకున్న. భర్త పోచయ్య సహకారంతో దుకాణాన్ని నిర్వహిస్తున్న. గొర్రెగుండం సమీపంలో రామన్నపేట, నూకపెల్లి, పోతారం, మద్దుట్ల, రాంపూర్, ఓబులాపూర్ ఉండడంతో రామన్నపేట క్రాస్ రోడ్డు వద్ద సూపర్ మార్కెట్ను పెట్టినం. అవసరమైన సామాను కావాలని ఫోన్ చేసి చెబితే ఇంటికి వెళ్లి ఇస్తున్నం. ఇప్పుడు రందీలేకుంట బతుకుతున్నం.
– దాసరి లక్ష్మి, గొర్రెగుండం, (మల్యాల మండలం)
నా భూమి దున్నుకుంటనే కిరాయికి కొడ్తా..
నాకు మా ఊరిల ఎకరం భూమి ఉన్నది. నీళ్లచ్చినప్పుడు పంటలు పండించేది. లేకుంటే బీడు పెట్టేది. దళితబంధు కింద ప్రభుత్వం ఇచ్చిన పదిలక్షలతో ట్రాక్టర్ను కొన్న. దీంతో నాకున్న ఎకరాన్ని దున్నుకుంట. గ్రామంలోని ఇతర రైతుల భూమి దున్నడానికి కిరాయికి వెళ్త. వ్యవసాయ పనులు పూర్తికాగానే ట్రాక్టర్కు ట్రాలీ పెట్టుకొని ఇతర పనులు జేసుకుంట. ఇప్పుడు సొంతూరిలోనే చేతినిండా పనిదొరుకుతున్నది. సాయం చేసిన సర్కారు మేలును మరువం.
కొల్లూరి సురేందర్, తక్కల్లపెల్లి, జగిత్యాల రూరల్ మండలం.(ట్రాక్టర్ లబ్ధిదారుడు)
పది లక్షలతో కొత్త జీవితం..
జీవితాంతం పనిచేసినా పదిలక్షలు సంపాదించలేని నాకు సీఎం కేసీఆర్ దళితబంధుతో కొత్త జీవితాన్నిచ్చిన్రు. ఎంబీఏ చేసి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న. తల్లిదండ్రులు, తమ్ముడు అందరం కలిసే ఉంటం. దళిత బంధు స్కీం ద్వారా తీసుకున్న కారును టాక్సీ కింద నడుపుతా. జిల్లాలో పర్యాటక స్థలాలు అధికంగా ఉండటంతో మంచి గిరాకీ ఉంటది. మారుమూల ప్రాంతమైన బీర్పూర్లో అత్యవసర సమయాల్లో వైద్య చికిత్స, ఇతర అవసరాల కోసం ప్రజలను తీసుకెళ్తుంట. మా తలరాతను మార్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
– పూడూరి రాజ్కుమార్, నర్సింహులపల్లె, బీర్పూర్ మండలం (కార్ ఓనర్)
మొబైల్ టిఫిన్ సెంటర్ పెట్టుకుంటం..
నేను బీడీలు చేస్త, నా భర్త కూలి పనిజేత్తడు. ఇద్దరం పొద్దంత కష్టపడ్డ కుటుంబం గడిసేది కాదు. కొడుకు ఉపేందర్ డిగ్రీ పూర్తి చేసి ఓ మొబైల్ టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. సరిపడా జీతం వస్తలేదు. సీఎం సార్ పెట్టిన దళితబంధు ద్వారా మొబైల్ టిఫిన్ సెంటర్ను పెట్టుకుంటం. ఎమ్మెల్యే రవిశంకర్ కృషితోనే అధికారులు దళితబంధుకు ఎంపికజేసిన్రు. సర్కారు ఇచ్చిన రూ. 10 లక్షలతో మల్యాల క్రాస్ రోడ్డు వద్ద మొబైల్ టిఫిన్ సెంటర్ను పెట్టుకుంటం.
– పబ్బ శోభ, గొర్రెగుండం, (మల్యాల మండలం)
దళితబంధు దారి చూపింది..
సర్కారు అమలు చేస్తున్న దళితబంధు పథకం మా కుటుంబానికి దారి చూపింది. ఈ స్కీం కింద రూ. 10లక్షలను ప్రభుత్వం ఖాతాలో జమచేసింది. ఈ పైసలతో ట్రాక్టర్ కొనుకున్న. పంటల టైంల మా భూమితో పాటు ఇతర రైతుల భూమిని కిరాయికి దున్నుత. దున్నుకాలు పూర్తికాగానే ట్రాక్టర్ను ఇతర పనులకు పెడుత. గింత మంచి సాయం చేసిన సర్కారును యాది మరువం.
– పులి రాజనర్సు, కిషన్రావుపేట, (వెల్గటూర్ మండలం)