జగిత్యాల, నవంబర్ 14(నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుపేదలైన దళిత వర్గాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.4 లక్షల వ్యయంతో నాలుగు బర్లను అందజేసి, వారికి ఉపాధి కల్పించేందుకు సంకల్పించింది. ఈ పథకానికి సంబంధించి ధర్మపురి నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. దీని పరిధిలోని వెల్గటూర్, ధర్మపురి, పెగడపల్లి, బుగ్గారం, గొల్లపల్లి మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేసి 194 యూనిట్లను కేటాయించారు. ఒక్కో యూనిట్కు రూ.4 లక్షలుగా నిర్ధారించి, నాలుగు బర్లను అందజేయాలని నిర్ణయించారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధిదారులకు 60 శాతం సబ్సిడీని కేటాయించారు. మిగిలిన 40 శాతం బ్యాంకు ద్వారా లబ్ధిదారులకు రుణం ఇప్పించాలని తీర్మానించారు. ఒక్కో బర్రెకు రూ.75,000గా ధర నిర్ణయించారు. పశు రవాణాకు రూ.8,800, పశువు బీమాకు రూ. 2,250, దాణాకు రూ.8,988, పశు వైద్య కిట్కు రూ. వెయ్యిగా నిర్ణయించారు. ఈ లెక్కన యూనిట్కు సంబంధించి నాలుగు బర్లకు రూ.3లక్షలు, పశువుల రవాణాకు రూ.35,200, దాణాకు రూ.9 వేలు, వైద్య కిట్లకు రూ.4 వేలు కేటాయించారు. కాగా, పెగడపల్లి మండలంలో 76 యూనిట్లు, ధర్మపురిలో 29, గొల్లపల్లిలో 34, వెల్గటూర్లో 23, బుగ్గారంలో 32 యూనిట్లను కేటాయించి, లబ్ధిదారులను ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం రూ.7.76 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.4.65 కోట్లు లబ్ధిదారులకు సబ్సిడీ కింద కేటాయించారు. ఇక రూ.3.10 కోట్లు బ్యాంకు రుణం కింద అందజేశారు.
179 యూనిట్ల గ్రౌండింగ్
మొత్తం 194 యూనిట్లను మంజూరు చేసి, లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు మొదటి ఫేజ్లో 179 యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. లబ్ధిదారుడికి నాలుగు బర్లు ఇవ్వాల్సి ఉండగా, మొదటి దఫా కింద రెండేసి బర్లను పంపిణీ చేశారు. మరో 15 యూనిట్లను గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. మొదటి, రెండో దఫాకు సంబంధించిన మొత్తం గ్రౌండింగ్ను వచ్చే నెల నాటికి పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రయోగాత్మకంగా ఏడాది ఏడాదిన్నర క్రితం ఈ పథకం ప్రారంభం కాగా, కరోనా నేపథ్యంలో రెండో దఫా బర్ల కొనుగోలులో కొంత ఆలస్యం జరిగింది.
హర్యానాలో బర్రెల కొనుగోలు
పాడి పశువుల కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ అంతా ఎస్సీ కార్పొరేషన్, పశువైద్యులు, బ్యాంకు అధికారుల నేతృత్వంలో జరుగుతోంది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన హర్యానా నుంచి నాణ్యమైన, మేలు జాతికి చెందిన బర్రెలను కొనుగోలు చేసి తీసుకువచ్చారు. వీటి కోసం వివిధ శాఖల అధికారుల, లబ్ధిదారుల బృందాలు హర్యానాకు వెళ్లి వచ్చాయి. పశువైద్యుడు, లబ్ధిదారుడు, బ్యాంకు మేనేజర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి బృందంగా ఏర్పడి హర్యానాకు వెళ్లి, అక్కడ పశువులను పరిశీలించి, వాటి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి కొనుగోలు చేశారు.
ప్రారంభమైన ఫలితాలు
దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన ఈ పైలెట్ ప్రాజెక్టుతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. రెండేసి బర్రెలను పెంచడం మొదలు పెట్టిన లబ్ధిదారులు ప్రస్తుతం వాటి నుంచి ఆదాయం పొందే స్థాయికి చేరుకున్నారు. 179 గ్రౌండింగ్ అయిన యూనిట్లలో దాదాపు 140 యూనిట్లలో బర్రెలు ఈని, పాలు ఇస్తున్నాయి. లబ్ధిదారులు మూడు నాలుగు నెలల నుంచి పాడి ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు.
సంతోషంగా జీవిస్తున్నం..
ఇంతకాలం కూలీ నాలి చేస్తూ బతికేవాళ్లం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై బర్రెలను ఇచ్చినంక పాలను అమ్ముతూ సంతోషంగ జీవిస్తున్నవ. నాకు రూపాయి ఖర్చు లేకుంట రెండు బర్రెలు వచ్చినయ్. బ్యాంకు ద్వారా రుణం ఇప్పించిన్రు. ఆరు నెలల తర్వాత మరో రెండు బర్రెలు ఇస్తామన్నరు. ఇప్పుడిచ్చిన బర్రెల్లో ఒకటి ఈనింది. ఇంకోటి ఈనాల్సి ఉంది. పూటకు మూడు లీటర్ల పాలు ఇస్తున్నది. రెండు పూటల ఆరు లీటర్లు ఇస్తున్నది. ఈ యూనిట్ నా కుటుంబానికి ఎంతో ఆసరైంది.
-లింగాల రవి, గోవిందుపల్లి, గొల్లపల్లి మండలం
ఎంతో ఆసరైతున్నయ్
సబ్సిడీపై ఇచ్చిన బర్రెల ద్వారా పాలను అమ్ముతూ ప్రతిరోజూ పైసల్ చూస్తున్నం. రోజుకు 8 లీటర్ల పాలను అమ్ముతూ రూ.400 సంపాదిస్తున్న. కూలి పనులు చేసుకునే నాకు సర్కారు ఇచ్చిన సబ్సిడీ పథకం అండగా నిలిచింది. ఇంటి వద్దే ఉంటూ బర్రెలను మంచిగ చూసుకుంటున్న. వస్తున్న పైసలు నా ఇంటికి ఎంర్త ఆసరైతున్నయ్.