కథలాపూర్: మండలంలోని తుర్తి గ్రామానికి చెందిన గండి మల్లయ్య(54) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ కిష్టయ్య ఆదివారం తెలిపారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లయ్య గతంలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి దొరక్కపోవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకుని తనకున్న మూడెకరాల భూమిలో పంటలు సాగు చేశాడు.
దిగుబడి సరిగ్గా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. సుమారు రూ.10 లక్షల వరకు అప్పులుండటంతో వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై శనివారం సాయంత్రం ఇంటి నుంచి పంట చేనుకెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం ఘటనాస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.