ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం
హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
మానకొండూర్, జూన్ 29: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముద్దసాని సులోచన అధ్యక్షతన నాలుగో విడుత పల్లెప్రగతి కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి పనిచేయాలని కోరారు. పల్లెప్రగతికి నిధుల కొరత లేదని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలన్నారు. పల్లెప్రగతిలో జిల్లాలోనే మానకొండూర్ నియోజకవర్గాన్ని ముందువరుసలో ఉంచడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొదటిస్థానంలో నిలిచిన గ్రామపంచాయతీకి ప్రోత్సాహకంగా రూ. 10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రావు, తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, స్వచ్ఛభారత్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్స్వామి, ఎంపీవో ప్రభాకర్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
తిమ్మాపూర్ రూరల్, జూన్ 29: వైద్య ఖర్చులతో ఇబ్బందులకు గురైనవారికి సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు. నాయకులు సిద్ధం వేణు, కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, మడుపు శ్రీనివాస్రెడ్డి, జక్కని రవీందర్ తదితరులు ఉన్నారు.
సదాశివపల్లి రైతులకు న్యాయం చేస్తాం
మానేరు రివర్ఫ్రంట్లో భూములు కోల్పోతున్న సదాశివపల్లికి చెందిన రైతులు మంగళవారం ఎల్ఎండీలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను కలిసి న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు.