50కోట్లతో సుందరీకరణ
8.20కోట్లతో బీటీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం
2కోట్లతో ఆహ్లాదకరంగా చిల్డ్రన్స్ పార్కు
సెంట్రల్ లైటింగ్ వెలుగులు
తుది దశకు ఆధునీకరణ పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు
మెట్పల్లి టౌన్, ఆగస్టు 18;సమైక్య రాష్ట్రంలో కళావిహీనమైన మెట్పల్లి స్వరాష్ట్రంలో మెరుగులు దిద్దుకుంటున్నది. మున్సిపాలిటీల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు నిధుల వరద పారిస్తుండడంతో పట్టణం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో మున్సిపల్ శాఖ మంత్రి 50 కోట్లు మంజూరు చేయగా, సుందరంగా తయారవుతున్నది. ఇప్పటికే సెంట్రల్ రోడ్లు, అండర్ డ్రైనేజీల పనులతోపాటు సె్రంటల్ లైటింగ్తో తనుకులీనుతున్నది. ఆధునీకరణ పనులు తుదిదశకు చేరుకోవడంతో పట్టణ రూపురేఖలే మారనున్నాయని ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మలిసారి అధికారంలోకి వచ్చాక అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యంగా పెట్టుకుంది. జగిత్యాల జిల్లాలో మున్సిపాలిటీల అభివృద్ధే లక్ష్యంగా అప్పటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సూచనల మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మెట్పల్లి మున్సిపాలిటీకి 50కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. మురుగు కాలువలు, రోడ్ల మధ్య డివైడర్లు, సీసీ రోడ్లతో పాటు, మున్సిపల్లో పట్టణ ప్రజలకు ఆన్లైన్ సేవలు, సిటిజన్ బడ్డీ వంటి వాటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పనులు ప్రారంభించారు. పట్టణంలో ఆధునీకరణ పనుల్లో భాగంగా 8.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణ పనులను చేపడుతున్నారు. మెట్పల్లి మున్సిపల్ పరిధిలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, రోడ్లు, మురుగు కాలువల పనులు ఇప్పటికే ప్రారంభించారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. మరికొద్దిరోజుల్లో పనులు పూర్తయి పట్టణం సర్వాంగ సుందరంగా మారనుంది.
8.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం
పట్టణంలో 8.20 కోట్లతో జాతీయ రహదారికి ఇరువైపులా పెద్ద మురుగు కాలువల నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణంలోని వట్టివాగు శివారు నుంచి పోలీస్స్టేషన్ సమీపంలో కాకతీయ కాలువ వరకు బీటీ రోడ్డును అభివృద్ధి చేస్తుండడంతోపాటు సెంట్రల్ లైటింగ్ను మరింత అభివృద్ధి చేస్తున్నారు. బీటీ రోడ్డు వెంబడి రహదారికి ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తున్నారు. వట్టివాగు నుంచి కాకతీయ కాలు వ వరకు డివైడర్ల ఎత్తును పెంచి వా టిలో మొక్కలు నాటించారు.
చిల్డన్స్ పార్కు… 2కోట్లతో పనులు
పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా దుబ్బవాడలోని ఎస్సారెస్పీ క్యాంపు సమీపంలో కూప్సింగ్ కుంట వద్ద చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కూప్సింగ్ కుంట వద్ద చిల్డ్రన్స్ పార్కు ఏర్పాటు కోసం 2 కోట్లను రెండు విడుతల్లో కేటాయించారు. మొదటి విడుతలో ఒక కోటి, రెండో విడుతలో మరో కోటి చొప్పున 2 కోట్ల నిధులతో పార్కులో పనులు పూర్తి చేశారు. ప్రధానంగా చిన్న పిల్లల ఆట పరికరాలు, వాకర్స్ కోసం ప్రత్యేక వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గ్రీనరీని పెంచుతున్నారు. పార్కుకు వచ్చే వారి కోసం టాయిలెట్స్ నిర్మాణం, ఓపెన్ జిమ్ ఏర్పాటు, వాచ్మెన్ కోసం ప్రత్యేక గది, ప్రత్యేక విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఎల్ఈడీ బల్బుల బిగింపు వంటి పనులను పార్క్లో చేపట్టారు.
సుందరీకరణ పనులు పూర్తి
పట్టణ ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులతోపాటు రోడ్లకు ఇరువైపులా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల మధ్య డివైడర్లను ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల మొక్కలు నాటాం. పట్టణంలో చిన్నారుల కోసం చిల్డ్రన్స్ పార్కు ఏర్పాటు చేయడంతో పాటు అందులో అన్ని పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చాం. పట్టణంలో ప్రధాన రహదారులు వెడల్పు చేయడంతో ట్రాఫిక్ సమస్య నెరవేరనుంది. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం.