అనుబంధంగా నర్సింగ్ కళాశాల
ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్
నెరవేరుతున్న చిరకాల కల
ఉమ్మడి జిల్లాకు ఎంతో ప్రయోజనం
జిల్లావాసుల హర్షం
సీఎంకు రుణపడి ఉంటాం : మంత్రి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జగిత్యాల జిల్లాకు మెడికల్ కళాశాల రాబోతున్నది. ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతోపాటు అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. కాలేజీ ఏర్పాటైతే వైద్య పరంగా అనేక వసతులు సమకూరే అవకాశమున్నది. జగిత్యాలకే కాదు, ఉమ్మడి జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరనున్నది. సీఎంకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపగా, సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ రాబోతున్నది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా జగిత్యాలతోపాటు సంగారెడ్డి, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ఈ మెడికల్ కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. నిజానికి పూర్వ కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటుచేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నది. అనేక సార్లు ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితులను బట్టి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉమ్మడి జిల్లాకు తప్పకుండా వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నిజానికి కరీంనగర్ జిల్లాతో పోలిస్తే జగిత్యాల వైద్యరంగంలో వెనుకబడి ఉన్నది. అలాగే, కరీంనగర్లో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకొని జగిత్యాలలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది.
పెరుగనున్న వైద్యసదుపాయాలు
వైద్య అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొవిడ్ నేపథ్యంలో వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలల ఆవశ్యకత ఎంత ఉందో ప్రపంచ వ్యాప్తంగా అర్థమైంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు మెడికల్ కళాశాల రావడంపై హర్షం వ్యక్తమవుతున్నది. దీని ద్వారా జగిత్యాల వైద్య పరంగా అభివృద్ధి చెందడమే కాకుండా, ప్రభుత్వ పరంగా వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేకాదు, ఈ ప్రాంత విద్యార్థులు చదువుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఒక ప్రభుత్వ వైద్య కళాశాల వస్తే.. ఆ ప్రాంతంలో పరిస్థితులు పూర్తిగా మారుతాయి. అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. నిపుణలైన వైద్యులు, ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. అత్యవసర పరిస్థితులను బట్టి జూనియర్ వైద్యుల సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే, అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇక కింది స్థాయి సిబ్బంది కొరత కూడా ఉండదు. కేవలం జగిత్యాలకు మాత్రమే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ కళాశాల సేవలను వినియోగించుకోవడానికి అవకాశముంటుంది. మొత్తం మీద దశాబ్దాల కల నెరవేరడంపై ఈ ప్రాంత వాసులు సంబురాలు చేసుకుంటున్నారు.
సీఎంకు రుణపడి ఉంటాం: మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల జిల్ల్లాలో ప్రభుత్వ మెడికల్ కశాల ఏర్పాటు చేయనున్నట్లగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత చిరకాల కల నేరవేరిందన్నారు. ముఖ్యమంత్రికి జగిత్యాలతోపాటు ఉమ్మడి జిల్లా ప్రజలు రుణ పడి ఉంటారని చెప్పారు. మెడికల్ కళాశాలతోపాటు దానికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడం సంతోషమన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారని, ఇన్నాళ్లకు అది ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో అవకాశం కలిగిందన్నారు. ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు వల్ల వైద్య సౌకర్యాలు, అవకాశాలు పెరగడమేకాకుండా.. జగిత్యాల జిల్లా యావత్తు మెడికల్ రంగానికి కేరాఫ్గా మారే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.