కోరుట్ల నియోజకవర్గం అతలాకుతలం
అత్యధికంగా కథలాపూర్ మండలంలో 10 సెంటీమీటర్లు నమోదు
మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు
పొంగిపొర్లిన వాగులు, వంకలు
మిగతా జిల్లాల్లోనూ వర్షాలు
ఉధృతంగా గోదారి, మానేరు నదులు
ఎల్ఎండీకి భారీ ఇన్ఫ్లో
ఎఖీన్పూర్ వాగులో చిక్కుకున్న ముగ్గురు
కాపాడిన పోలీస్, అగ్నిమాపక సిబ్బంది
నీటిలో కొట్టుకుపోయిన ముగ్గురు రైతుల బైక్లు
వేంపల్లి వాగులో రైతు గల్లంతు
సాతారం వాగులో చిక్కిన ఏడుగురు సురక్షితం
జగిత్యాల, జూలై 15 (నమస్తే తెలంగాణ)/తిమ్మాపూర్/ ధర్మపురి/ కోరుట్ల/కోరుట్లరూరల్/ చిగురుమామిడి: ఉమ్మడి జిల్లాలో జోరువాన పడ్డది. బుధవారం రాత్రి నుంచి జిల్లాలో వాన దంచికొట్టింది. కోరుట్ల నియోజకవర్గం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా, మెజారిటీ చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. వర్ష బీభత్సానికి పలు గ్రామాలకు రవాణా సౌకర్యం దెబ్బతిన్నది. ఇటు జిల్లాతోపాటు ఎగువన పడుతున్న జోరు వానలకు ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా పారుతున్నది. ఎగువ, దిగువ మానేరు జలాశయాలు, ఎల్లంపల్లి నిండుకుండలా మారగా, అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.
ఉమ్మడి జిల్లాలో వాన కుండపోత పోసింది. రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా, జిగిత్యాల జిల్లా తడిసిముద్దయింది. మెజార్టీ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు అక్కడక్కడా రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గన్నేరువరం మండలం మల్లిఖార్జున కుంట మత్తడి దూకడంతో ప్రవాహానికి గునుకుల కొండాపూర్ నుంచి చొక్కల్లపల్లి, పీచుపల్లికి వెళ్లే మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. పారువెళ్ల ఊర చెరువు మత్తడి నీరు పారువెళ్ల గన్నేరువరం మార్గంలోని రొడ్యాం మీదుగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. అలాగే గన్నేరువరం ఊర చెరువు మత్తడి ప్రవాహం రోడ్డు పై నుంచి ప్రవహిస్తుండడంతో గన్నేరువరం, కరీంనగర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు ఇరు వైపులా నిలిచిపోయాయి. చిగురుమామిడి మండలంలో మోయ తుమ్మెద వాగు ఉధృతంగా పారుతున్నది. ఇందుర్తిలో చెక్ డ్యాం పొంగింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో చిట్టివాగు పరవళ్లు తొక్కుతుండగా, పాత చెరువు నిండుకుండలా మారింది. తిమ్మాపూర్ శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న కాజ్వే పై నుంచి ఒర్రె నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వేములవాడ, వేములవాడ రూరల్ మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పత్తి, మక్క, కంది చేనుల్లో వర్షం నీరు నిలిచింది.
గోదావరి ఉధృతి..
ధర్మపురి వద్ద గురువారం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువన వర్షాలకుతోడు నిర్మల్ జిల్లా కడెం జలాశయం ఏడు గేట్లు ఎత్తి గోదావరిలోకి 50,743 క్యూసెక్కుల విడుదల చేస్తుండడంతో ధర్మపురి, రాయపట్నం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. తీరప్రాంత ప్రజలు, భక్తులను గోదావరిలోకి వెళ్లనీయకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఎల్ఎండీకి భారీగా ఇన్ఫ్లో..
రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్ఎండీ రిజర్వాయర్కు భారీగా ఇన్ఫ్లో వస్తుంది. మోయ తుమ్మెద వాగు నుంచి 10,701 క్యూసెక్కులు వస్తుండగా, 3293 క్యూసెక్కులు అవుట్ఫ్లో రూపంలో బయటికి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 24.034 టీఎంసీలు గల రిజర్వాయర్లో 21.223 టీఎంసీలు ఉన్నట్లు వెల్లడించారు.
కథలాపూర్, మెట్పల్లి మండలాల్లో కుంభవృష్టి..
జగిత్యాల జిల్లా కథలాపూర్, మెట్పల్లి మండలాల్లో వాన దంచికొట్టింది. కథలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో కథలాపూర్లోని పలు కుంటల్లోకి భారీగా నీరు చేరుకున్నది. చింతకుంట గ్రామంలోని ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఒడ్డెర కాలనీలోకి నీరు చేరడంతో కొన్ని గుడిసెలు నీట మునిగాయి. భూషణ్రావుపేట మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వర్షం కురియడంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరి, మత్తడి దుంకింది. మెట్పల్లి మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులపై ఉన్న కాజ్వేల పై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మెట్లచిట్టాపూర్, రంగాపూర్, ఆత్మకూర్ గ్రామాలకు మెట్పల్లి నుంచి కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం ధాటికి కోరుట్ల పట్టణంలోని పూల్వాగులో వరద ఉధృతి పెరిగింది. దీంతో పరీవాహక ప్రాంతాల్లో ఉన్న గంగంపేట, బాబుజగ్జీవన్ రామ్ కాలనీలోని నివాస గృహల్లోకి వరద నీరు చొచ్చుకు వచ్చింది. పలు ఇళ్లు వరదనీటిలో చిక్కుకోగా, అప్రమత్తమైన స్థానిక కౌన్సిలర్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జోరుగా కురిసిన వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సేద్యపనులకు ఇబ్బంది లేకుండాపోయిందని, వరి పంట పుష్కలంగా పండేందుకు అవకాశాలు పెరిగాయని పొలాస శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొత్తంగా కథలాపూర్ మండలంలో 10, కొడిమ్యాల, మెట్పల్లి, కోరుట్ల తదితర మండలాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
ఎకీన్పూర్ వాగులో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు..
ఎగువన కురిసిన భారీ వర్షాలకు పలు చెరువు కట్టలకు గండి పడి కోరుట్ల పట్టణ పరిధిలోని ఎకీన్పూర్ వాగు ఉధృతంగా ప్రవహించగా, బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులతో పాటూ ఓ మత్స్యకారుడు చిక్కుకున్నారు. రక్షించాలని కేకలు వేయడంతో పక్కనే ఉన్న రైతులు అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది వచ్చి స్థానిక యువకుల సాయంతో ఎఖీన్పూర్కు చెందిన మక్కర్ల విజయ్, సంగెం గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీనివాస్, కోరుట్ల అయ్యప్పగుట్టకు చెందిన సావూస్ను కాపాడారు. యువకులను రక్షించేందుకు స్థానిక సీఐ రాజశేఖర్రాజు, ఎస్ఐ సతీశ్ ప్రత్యేక చొరవ చూపగా, పరిస్థితిని మెట్పల్లి డీఎస్పీ గౌస్బాబా, కోరుట్ల ఆర్డీవో వినోద్కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ సమీక్షించారు. అలాగే గ్రామ రైతులకు చెందిన మూడు బైక్లు వాగులో కొట్టుకు పోయినట్లు స్థానికులు తెలిపారు.