ఆలయ అర్చకులతోపాటు భక్తులు విన్నవించినా చోద్యం
దాతల విరాళాలు 3కోట్లతోనే కొద్దోగొప్పో పనులు
సమయానికి వచ్చి తలంబ్రాలు సమర్పించి వెళ్లడమే ఆయన పని
జమ్మికుంట, ఆగస్టు 14: ఒక నేత రెండు సార్లు మంత్రిగా పనిచేశాడంటే ఆ నియోజకవర్గం ఎలా ఉండాలి? అక్కడి పట్టణాలు ఎలా కనిపించాలి? ఇక పేరుగాంచిన ఆలయాలు ఇంకెంత వెలుగొందాలి? కానీ, హుజూరాబాద్ నియోజకవర్గంలో చూస్తే పరిస్థితి భిన్నంగా ఉన్నది. పట్టణాలు, పల్లెల సంగతి పక్కన పెడితే.. భక్తుల కొంగుబంగారంగా, అపర భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. ఈటల రాజేందర్ ఏకంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినా కనీసం ఆలయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఆయనకు దేవాలయాలంటే పడదు. పైగా లెఫ్టిస్ట్ అంటడు. కొబ్బరికాయ చేతికిస్తే ఎటో చూస్తడు. బొట్టు పెడితే ససేమిరా అంటడు. కానీ, ఇప్పుడు మాత్రం లెఫ్ట్ నుంచి రైటుకు పోయి వేదాలు వల్లిస్తున్నడని భక్తజనం మండిపడుతున్నది. కనీసం అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఈ ఆలయంపై ఆది నుంచీ చిన్నచూపే దిక్కయింది. గుడి విస్తరణ, భక్తుల కోసం ప్రత్యేకంగా 100 గదులు, పుష్కరిణికి రోడ్డు ఇలా.. ఎన్నో.. అభివృద్ధి పనుల కోసం అర్చకులతోపాటు ఎందరో విన్నపాలు చేశారు. అయినా ఏనాడూ వినిపించుకోలేదు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కానరాదు. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తులు స్నానం చేసే పుష్కరిణికి రోడ్డే లేదు. దిగి స్నానం చేసే అవకాశమే లేదు. ఇక ఆయన తెచ్చిన సుమారు రూ.70లక్షల నిధులతో షెడ్ల నిర్మాణం పూర్తి చేయించారు. ఇదొక్కటి తప్పా.. ఇక మిగతా అభివృద్ధంతా భక్తులు, దాతలు అందించిన సహకారంతోనే జరిగింది. ప్రముఖ కంపెనీకి చెందిన భాగస్వాములు అందించిన రూ.2-3కోట్లతోనే (స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం) పనులు చేశారు. వారిచ్చిన విరాళంతో గుడి చుట్టూ సాలారం, మూడు రాజ గోపురాలు, కల్యాణ మండపం, ఎదుర్కోళ్ల మండపం, బేతాళ స్వామి గుడి, షెడ్ల కింద మార్బుల్ని అందించి కట్టించారని స్థానికులు చెప్పారు. ఇక్కడ అభివృద్ధి మాత్రమే చేయలేదు. కానీ మెదక్ జిల్లాలో సీతారామస్వామి ఆలయ భూములు కబ్జా చేసినట్లు వార్తలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తున్నది.
పైసల మంత్రిగా ఉన్నా పట్టలే..
ఇక ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. అందులో శ్రీరామ నవమి వేడుకలు.. రాములోరి కల్యాణం మరింత కమనీయంగా సాగుతుంది. భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం జమ్మికుంట వ్యాపారులు తలా రూ.20వేలకు పైగా చందాలు వేసుకుని అన్నదానం చేస్తున్నారు. సదరు వేడుకలు వేసవిలో రావడం వల్ల భక్తుల కోసం ఓ దాత చల్లా ట్యాంకర్లను అందిస్తున్నారు. ఇక ఈటల మాత్రం సమయానికి మంత్రి హోదాలో రావడం.. తలపాగతో తలంబ్రాలు సమర్పించి వెళ్లిపోవడం అనవాయితీగా ఉంది. ఇదీ ఆయన తీరు. ఇక ఆయన రెండుసార్లు చేసిన మంత్రి పదవుల్లో ఒకటి అల్లాటప్పా మంత్రి పదవి కాదు సుమా.. ఆర్థిక మంత్రి. అంటే అందరికీ పైసలిచ్చే పదవి. అలాంటి కీలక పదవిలో ఉండి కూడా సీతారామచంద్రస్వామిని పట్టించుకోలేదు. అభివృద్ధి చేసేందుకు చేతులూ రాలేదు. ఎందుకో ఆయనకే తెలియాలి.