కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేస్తున్నది?
అభివృద్ధి పట్టని ఈటలకు ఓటుతో బుద్ది చెప్పాలి
ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం లక్ష్యం
హుజూరాబాద్లో మంత్రి గంగుల కమలాకర్
కుల సంఘాల ప్రతినిధులకు భవన నిర్మాణ మంజూరు పత్రాల అందజేత
హుజూరాబాద్టౌన్, ఆగస్టు 7: బీజేపీతో ఒరిగేదేం లేదని, కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజలపై ధరల భారం మోపడం తప్ప రూపాయి లాభం చేయడం లేదని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. బీజేపీకి ఓటేస్తే ఏం ప్రయోజనం లేదని.. రాజేందర్ గెలిస్తే రాజాసింగ్, రఘునందన్ పకన ఓ ఎమ్మెల్యేగా ఉంటడు తప్ప ఏం చేయలేడని ఎద్దేవా చేశారు. కానీ హుజూరాబాద్ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే అడగ్గానే వరాలు కురిపించే తెలంగాణ ప్రభుత్వానికి ఓటర్లు అండగా నిలువాలని మంత్రి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం హుజూరాబాద్ సిటీ సెంటర్ హాల్లో నాయీబ్రాహ్మణ, మేదరి సంఘం, రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయా కుల సంఘ భవనాలకు భూమితో పాటు భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా, అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను సంఘాల ప్రతినిధులకు అందజేసి, మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరుగుతున్నదని చెప్పారు.
ఇప్పటికే మున్నూరుకాపు, గౌడ, యాదవ, రజక, వైశ్య, మహిళా సంఘాలకు భూములతో పాటు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. ఏడేళ్లు మంత్రిగా పనిచేసిన ఈటల బడుగు బలహీన వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం ఏనాడూ పాటుపడలేని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రగతిని గాలికొదిలేశాడని, ఎకడ చూసినా గుంతలు, మట్టిరోడ్లు దర్శనమిచ్చాయన్నారు. అభివృద్ధి పట్టని ఈటలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అడుగగానే హుజూరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.40 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 121 రోడ్లు పనులు ప్రారంభమయ్యాయని, మరో నెల రోజుల్లో పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసి మద్దతుగా నిలువాలని గంగుల కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరిచిందని, ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ నాయకులను నిలదీయాలని సూచించారు. ఈటల పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. గోడ గడియారాలు, కుట్టుమిషన్లు, ప్రెషర్ కుకర్లు పంచి ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఇక్కడ కరీంనగర్ మేయర్ వై సునీల్రావు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల, సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు రమాదేవి, కుమార్యాదవ్, టీఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్, పోరెడ్డిశంతన్ రెడ్డి, వాసాల రమేశ్, గోవిందుల భాస్కర్, నరేశ్, శివ, వివిధ కులసంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
రుణపడి ఉంటం..
అడిగిన వెంటనే మమ్ములను ఆదరించి స్థలాన్ని కేటాయించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి నాయీ బ్రాహ్మణులందరం రుణపడి ఉంటం. కులం మీటింగ్ పెట్టుకోడానికి కమ్యూనిటీ హాల్ లేక ఇన్నాళ్లూ మేం చాలా ఇబ్బందులు పడ్డం. భవనం కావాలని గతంల ఈటలను ఎన్నిసార్లు కలిసి అడిగినా పట్టించుకోలేదు. కానీ మా సమస్యలు విన్న వెంటనే స్థలం, నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటం. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేస్తం.