రూ. 29 లక్షలతో డ్రైనేజీల్లో పూడిక తీత
మేయర్ వై సునీల్రావు
కార్పొరేషన్, జూన్ 3: నగరంలో వానకాలంలో వరద నీటితో ముప్పు లేకుండా చూసేందుకు ప్రధాన మురుగు కాలువల్లో రూ. 29 లక్షలతో పూడికతీత పనులు చేపడుతున్నట్లు మేయర్ వై సునీల్రావు తెలిపారు. అశోక్నగర్లో గురువారం ఆయన పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను తొలగిస్తున్నట్లు తెలిపారు. పనులు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పలు ప్రాంతాల్లో ప్రధాన కాలువలు శిథిలావస్థకు చేరడంతో భారీగా వరద వచ్చినప్పుడు ముప్పు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా స్మార్ట్సిటీ నిధులు రూ. 129 కోట్లతో ప్రధాన మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాలువల నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే, మురుగు నీటిని శుద్ధీకరణ చేసేలా కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. పూడిక తొలగింపు పనులను నిత్యం ఏఈలు పర్యవేక్షించాలని, త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.
శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం
కార్పొరేషన్, జూన్ 3: నగరంలోని శివారు ప్రాంతాల్లో సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మేయర్ వై సునీల్రావు తెలిపారు. 12వ డివిజన్లో సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అన్ని డివిజన్లలో అభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గం పని చేస్తుందన్నారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలపై ప్రతిపాదనలు వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని డివిజన్లలో రోజూ తాగునీరు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు నాంపెల్లి శ్రీనివాస్, తోట రాములు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, నాయకులు వంగల పవన్, పిట్టల శ్రీనివాస్, చంద్రశేఖర్, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.