మారుతున్న నగర రూపురేఖలు
పట్టణ ప్రగతితో సమస్యల పరిష్కారం
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
కార్పొరేషన్, జూలై 2: కరీంనగర్ను రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రధానమైన నగరంగా అద్భుతంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ వెల్లడించారు. శుక్రవారం నగరంలోని 59వ డివిజన్లో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, నగరంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధ్ది పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చేపట్టిన పనులన్నీ ప్రజలకు కనిపిస్తున్నాయని, వీటితో నగర రూపురేఖలు మారుతున్నాయన్నారు. ఇప్పటికే నగరంలో ఐటీ టవర్ తీసుకువచ్చామన్నారు. దీనివల్ల అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు.
అలాగే ప్రస్తుతం మానేరు రివర్ ఫ్రంట్ చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యంత అద్భుతంగా ఈ ప్రాజెక్టును తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పనులు తుది దశకు వచ్చాయన్నారు. ఇటీవలే ఈ బ్రిడ్జికి సంబంధించి లోడింగ్ టెస్టు కూడా సక్సెస్గా పూర్తి చేశామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్కు సంబంధించి డీపీఆర్ సిద్ధమవుతున్నదన్నారు. అది పూర్తి కాగానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తీసుకువస్తామన్నారు. మానేరు డ్యాం కింద కూడా సుందరీకరణకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి సీఎం దృష్టికి తీసుకుపోయామని తెలిపారు. వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే వారికి మొదట ఈ ప్రాజెక్టే కనిపిస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్తో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నగరం ఓ పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. హరితహారంలో ప్రజలందరూ పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్, కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్లు గందె మాధవి, రాజేందర్రావు, వాల రమణరావు, బోనాల శ్రీకాంత్, సరిళ్ల ప్రసాద్, అజిత్రావు తదితరులు పాల్గొన్నారు.