నాడు 500లకు పైగా బోర్లు
రెండేళ్ల నుంచి ఒక్కటీ లేదు
గతంలో 600 ఫీట్ల లోతు వేసినా కనిపించని నీళ్లు
ప్రస్తుతం 24 గంటలపాటు నడిచినా ఆగని బోర్లు
బూరుగుపల్లి కష్టాలు తీర్చిన వరదకాలువ
గంగాధర, ఏప్రిల్ 30:నెర్రెలు బారిన చెరువు.. ఎటు చూసినా ఎడారిని తలపించే బీడు భూములు.. రెండో పంట ఊసేలేని పరిస్థితులు.. ప్రభుత్వాలు.. పాలకులు మారినా నీటి కోసం ఎదురు చూసి, విసిగి వేసారిన రైతులు.. వందల ఫీట్లు వేసినా చుక్క పడక నోర్లు తెరిచిన బోర్లు.. ఇవీ ఒకప్పటి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ పరిస్థితులు.. కానీ, మూడేళ్ల నుంచి అవన్నీ పోయాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరదకాలువ నిండా నీళ్లు ఉంటుండడంతో ఎండకాలంలోనూ ఆ ఊరి చెరువు నిండుకుండను తలపిస్తున్నది. బీడు భూములు సస్యశ్యామలమయ్యాయి. చుక్క నీరురాని బోర్ల నుంచి 24 గంటలపాటు పుష్కలంగా వస్తున్నాయి. రెండు పంటలు పండడమేకాదు.. కొందరు రైతులు మూడోపంట కూడా వేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత బూరుగుపల్లి పరిస్థితి మారింది. ఎస్సారెస్పీ పునర్జీవన పథకంలో భాగంగా వరదకాలువలో ఎప్పుడూ నీళ్లు ఉండడం.. గ్రామ చెరువులను నింపుతుండడంతో రైతుల దశ తిరిగింది. కొన్నేండ్ల కిందటి వరకు గ్రామంలో సుమారు 500 బోర్లు వేయించారు. ఒక్కొక్కటి 600 ఫీట్ల లోతు వేసినా చుక్క నీరు రాక.. కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో కన్నీరు కార్చారు. కానీ, ఇప్పుడు తాగునీటి అవసరాలకు మినహా వ్యవసాయ కోసం రెండేళ్లలో ఒక్క బోరు కూడా వేయలేదు. అంతే కాదు.. పాత బోర్లలో ఇప్పుడు 24 గంటల పాటు మోటర్లు నడిచినా నీళ్లు ఆగడం లేదు. కాగా, ఈ గ్రామంలో 660 మంది రైతులు ఉండగా 1407 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నది. గత వానకాలం కాలంలో 1304 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, యాసంగిలో 1150 ఎకరాల్లో పంటలు సాగు చేశారు.
16 బోర్లు వేసిన
తెలంగాణ సర్కారు వరద కాలువకు నీటిని విడుదల చేయక ముందు పంటలకు నీళ్లు పెట్టడానికి బోర్లు వేయించటోన్ని, మా భూమిలో మొత్తం 16 బోర్లు వేయించగా రెండు బోర్లల్ల నీళ్లు పడ్డయి. మిగిలిన 14 బోర్లల్ల నీళ్లు పడలేదు. ఒక్కో బోరును 600 మీటర్ల వేయించినా చుక్కా నీళ్లు పడలేదు. నీళ్లు పడని 14 బోర్లకు దాదాపు 5 లక్షల వరకు ఖర్చు పెట్టిన. నీళ్లు పడ్డ రెండు బోర్లకు లక్షా 50 వేలు ఖర్చు అయ్యింది. మొత్తం ఏడున్నర లక్షల వరకు ఖర్చు చేసిన. తెలంగాణ సర్కారు వరదకాలువకు నీళ్లు ఇచ్చినంగా నీళ్లకు కరువు లేకుంట పోయింది. మా ఊరి చెరువు నిండ నీళ్లు ఉండటంతోని మొత్తం భూమిని సాగు చేయడానికి సిద్దమైతున్న. కేసీఆర్ సారు ఉన్నన్ని రోజులు రైతులకన్నీ మంచి రోజులే ఉంటాయన్న భరోసా వచ్చింది.
600 ఫీట్లు వేసినా చుక్కా నీరు పడలే
కాళేశ్వరం నీళ్లు రాకముందు పంటలు సాగు చేయడానికి అరిగోస పడ్డం. ఏసిన పంటలు ఎండి పోకుంట కాపాడుకుంటానికి నా భూమిలో 15 బోర్లు ఏసిన. 600 ఫీట్ల లోతులో రెండు బోర్లల్ల నీళ్లు పడ్డయి. మిగిలిన బోర్లల్ల చుక్కా నీరు పడలేదు. లక్షల రూపాయల పెట్టి బోర్లు వేయించినా చుక్కా నీరు పడకపోవడంతో ఎవుసం చేయడానికి కూడా మనసొప్పలేదు. పంటలకు సాగు చేయడానికి నీళ్లు లేక భూములను బీడు పెట్టేవాడిని. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరదకాలువకు నీటిని విడుదల చేసి మా ఊరి చెరువును నింపడంతో ఇప్పుడు మొత్తం పంటకు సాగు నీరు అందుతోంది. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగు నీరు అందజేస్తున్నడు. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
-చీటి కొండాల్రావు, రైతు, బూరుగుపల్లి
ఇన్ని నీళ్లు చూస్తమనుకోలె..
నా జీవితంలో ఇన్ని నీళ్లు చూస్తనని అనుకోలే. నా చిన్నప్పటి నుంచి చూస్తున్న మా ఊరి చెరువు ఎండకాలంలో పూర్తిగా నిండడం ఇప్పటి వరకు చూడలేదు. వర్షాకాలంలోనే చెరువు నిండడం చూడలేదు ఇగ ఎండాకాలంల చెరువు నిండుడు కలే అనుకున్న. కానీ నేను కల అనుకున్నదాన్ని తెలంగాణ సర్కారు నేడు నిజం చేసింది. నాకు పావుదక్క మూడెకరాల ఎవుసం భూమి ఉంది. కాళేశ్వరం నీళ్లు రాకముందు మూడు బోర్లు ఏసిన. ఒక్కదాంట్లనే నీళ్లు వచ్చినయి. ఇప్పుడు మా ఊరి చెరువుల నిండ నీళ్లు ఉండటంతోని పైసా ఖర్చు లేకుంట మొత్తం పొలం పారుతుంది. ఇదంతా సీఎం కేసీఆర్ సారు పుణ్యమే.
-మ్యాక భూమయ్య, రైతు, బూరుగుపల్లి