రాయికల్, జనవరి 5 : తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్గా చేసుకొని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డ ఘరానా దొంగను రాయికల్ పోలీసులు పట్టుకున్నారు. రూ.11లక్షల7వేల సొత్తు రికవరీ చేశారు. ఈ మేరకు జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆర్ ప్రకాశ్ వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన మిట్టపెల్లి లక్ష్మణ్.. చిన్నతనం నుంచే వ్యసనాలకు అలవాటయ్యాడు. దీంతో పాటు మద్యానికి బానిసయ్యాడు. అందుకు చోరీలకు పాల్పడడం మొదలు పెట్టాడు. లక్ష్మణ్ దొంగగా మారడంతో అతడి తీరుకు విసుగు చెందిన తల్లిదండ్రులు చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లిన లక్ష్మణ్, హోటల్లో పనిచేశాడు.
జీతం జల్సాలకు సరిపోకపోవడంతో మళ్లీ దొంగతనాలు ప్రారంభించాడు. 2015లో హైదరాబాద్ పోలీసులకు చిక్కడంతో చర్లపెల్లి జైలుకు తరలించారు. నాలుగేళ్లు జైల్లో ఉండి బయటికు వచ్చాడు. అనంతరం మహబూబ్నగర్, నిర్మల్ జిల్లాల్లో 30 దొంగతనాలకు పాల్పడ్డాడు. 2022, ఫిబ్రవరిలో నిర్మల్ జిల్లా పోలీసులకు మరోసారి పట్టుబడడంతో జైలుపాలయ్యాడు. జైలు నుంచి తిరిగి వచ్చిన లక్ష్మణ్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్కు తన మకాన్ని మార్చాడు. ధర్మాబాద్లో ఉంటూ జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలం, రాయికల్, కోరుట్ల, మెట్పెల్లి ప్రాంతాల్లో సంచరిస్తూ పగటిపూట తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డాడు. రాత్రికి ధర్మాబాద్ వెళ్లి, అక్కడ జల్సాలు తీర్చుకునేవాడు.
కాగా, జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్, రాయికల్ ఎస్ఐ కిరణ్కుమార్, రాయికల్ మండలం మైతాపూర్ శివారులో మల్లన్న గుడి వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా, రాయికల్లో చోరీకి గురైన పల్సర్ బండిపై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. లక్ష్మణ్ను పట్టుకొని విచారించగా, జగిత్యాల జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన విషయం బయటపడింది. జిల్లాలో ఆరు చోరీ కేసుల్లో 19 తులాల బంగారం, 30 తులాల వెండి, పల్సర్ బైక్, రూ.11వేల నగదును స్వాధీనం చేసుకొని లక్ష్మణ్ను రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్, రాయికల్ ఎస్ఐ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. దొంగను పట్టుకున్న సీఐ, రాయికల్ ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు.