జగిత్యాల బీఆర్ఎస్ గుబాళించింది. శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. ప్రగతి సారథి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన సూపర్ సక్సెస్ కావడంతో నూతనోత్తేజాన్ని నింపింది. మంగళవారం జగిత్యాల, ధర్మపురిలో పర్యటించిన అమాత్యుడు రామన్న, 573 కోట్లతో చేసిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఆయాచోట్ల నిర్వహించిన బహిరంగ సభలకు హాజరై, తన ప్రసంగంతో ఉర్రూతలూగించారు. కాంగ్రెస్ అంటే గతమని, దాని పని ఏనాడో ఖతమైపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసిన బీజేపీకి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ గుండు లెక్క గుండు సున్నా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై ప్రశంసల వర్షం కురిపించి, భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునివ్వగా, వేలాది మంది సభికులు జైకొట్టారు.
మా కొప్పుల ఈశ్వరన్న ధర్మపురి ధర్మరాజు. మృధుస్వభావి. చాలా సౌమ్యుడు. ఒక పేద కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో మంత్రిగా ఎదగడం చాలా గొప్ప విషయం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచి రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఈశ్వరన్నకు నేను పెద్ద అభిమానిని. ఆయన కృషితోనే ధర్మపురి పట్టణం ఎనలేని అభివృద్ధి సాధించింది. ధర్మపురి పేరులోనే ధర్మమున్నది. రానున్న ఎన్నికల్లో ధర్మపురిలో ఈశ్వరన్నను 50వేల మెజార్టీతో గెలిపిస్తేనే ధర్మమున్నట్టు. లేకపోతే ధర్మం లేనట్టే. ధర్మపురి నుంచి గెలిచి మొదటి సారి ప్రభుత్వ విప్గా పనిచేసినపుడే కోట్లాది రూపాయలు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు మంత్రిగా ధర్మపురిని మున్సిపాలిటీ చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఇదివరకు ఇచ్చిన 45కోట్ల మున్సిపల్ నిధులతో ధర్మపురి ఎంతో అభివృద్ధి సాధించింది. ఈశ్వరన్న కోరకున్నా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఫిదా అయినా. మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ధర్మపురి పట్టణానికి మరో 25 కోట్లు మంజూరు చేస్తున్నా.
– మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి జగిత్యాల, ధర్మపురిలో పర్యటించారు. 573 కోట్లతో నిర్మించిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా జగిత్యాలకు చేరుకున్న ఆయన, నూకపెల్లి వద్ద కేసీఆర్ కాలనీలో 280 కోట్లతో నిర్మించిన 4,520 డబుల్ బెడ్రూం ఇండ్లు, 40 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, 4.50 కోట్లతో నిర్మించిన మార్కెట్ యార్డు ఆవరణలో సమీకృత కూరగాయల మార్కెట్ను ప్రారంభించారు. అనంతరం వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. వేదికపై డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్నం 2.25 గంటలకు హెలీకాప్టర్లో ధర్మపురికి చేరుకున్నారు. 8.50 కోట్లతో నిర్మించిన 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. 247.86 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాల పైలాన్ను ఆవిష్కరించారు. ధర్మపురి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు జంబో ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. ఇదే వేదిక పై నుంచి వెల్గటూర్ మండలంలో 60కోట్లతో నిర్మించే అగ్రికల్చర్ డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 4.20 గంటలకు బహిరంగ సభను ముగించుకొని, హెలీకాప్టర్ లోరాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లారు.
జగిత్యాల/కరీంనగర్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ)/ ధర్మపురి: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్కు జగిత్యాల జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హోంమంత్రి మహమూద్అలీ, రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మంగళవారం జగిత్యాల, ధర్మపురిలో పర్యటించగా, ఆయాచోట్ల నీరాజనం పలికారు. ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు నియోజకవర్గాల నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. జగిత్యాలలో ఉదయం 9 గంటల నుంచే ఆటోలు, బైక్లు, బస్సుల్లో చేరుకున్నారు. పలు కుల సంఘాల నాయకులు చేతివృత్తులను ప్రదర్శిస్తూ, మేళాతాళాలతో అట్టహాసంగా సభాస్థలికి చేరుకున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలు, కుల సంఘాల నాయకులు, డ్వాక్రా మహిళలు, పెద్ద సంఖ్యలో కదిలివచ్చారు.
ధర్మపురిలోనూ స్వచ్ఛదంగా సభకు వచ్చారు. మధ్యాహ్నం 12.15 గంటలకు జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరు సంజయ్ అధ్యక్షతన, మధ్యాహ్నం 2.55 గంటలకు ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభకు అమాత్యుడు రామన్న హాజరయ్యారు. ఆయాచోట్ల కేటీఆర్ వేదికలపైకి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా జనం కేరింతలు కొట్టారు. పెద్దపెట్టున కరతాళ ధ్వనులు చేశారు. జగిత్యాలలో 38 నిమిషాలు, ధర్మపురిలో 35 నిమిషాలపాటు తన ప్రసంగంతో ఉర్రూతలూగించారు. చెణుకులు, సామెతలతో తనదైన శైలిలో విపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధించారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజల కోసం తపన, జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలు, వెచ్చిస్తున్న నిధులు, కలుగుతున్న లబ్ధిని విడమరిచి చెప్పారు. బీజేపీ కులమత వివక్షపూరిత రాజకీయాలు, కాంగ్రెస్ కుటిల నీతి, తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూనే.. తొమ్మిదేండ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని అర్థమయ్యేలా ఏకరువుపెట్టారు. మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్పై మంత్రి రామన్న ప్రశంసల జల్లు కురిపించారు. ఇద్దరూ తమ నియోజకవర్గాల అభివృద్ధికి చేసిన కృషిని వివరిస్తూనే.. మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయాచోట్ల అమాత్యుడు రామన్న ప్రసంగిస్తున్నంతసేపూ సభికులు హర్షధ్వానాలతో జేజేలు పలికారు. ‘జై కేసీఆర్’ ‘జై కేటీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. సభలు సక్సెస్ కావడం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలిరావడంతో నయాజోష్ కనిపించింది.
‘కాంగ్రెస్ అంటే గతం. దాని పని ఏనాడో ఖతమైపోయింది. జీవన్రెడ్డి జగిత్యాల ప్రజలకు గతం లాంటి వారు. భవిష్యత్తు అంటే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాత్రమే. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్యే సంజయ్కుమార్ కోరినట్లు జగిత్యాల పట్టణంలో రైతులకు ఇబ్బందులు లేకుండా పట్టణ ప్రణాళికను రూపొందిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను రూపొందిస్తాం. వరి ఉత్పత్తి జగిత్యాల ప్రాంతంలో విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రోజుకు వెయ్యి క్వింటాళ్ల ధాన్యం మరాడించే పరిశ్రమస్థాపనకు కృషి చేస్తాం. జగిత్యాల ప్రాంతం మామిడి పంటకు ప్రసిద్ధి. మామిడి రైతుల కోసం పెప్సీ లేదా కోకాకోలా కంపెనీల్లో ఏదో ఒక్కదాన్ని ఇక్కడికి తీసుకువస్తా. 50 కోట్లతో మరో వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం సైతం చేపడుతాం. మీరు జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్కుమార్ను 75వేల మెజార్టీతో గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి తీర్చిదిద్దే బాధ్యతను నేను తీసుకుంటా. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోసం అడిగిన ప్రతి పనిని మంజూరు చేస్తా..సమస్యలన్నీ పరిష్కరిస్తా.
– మంత్రి కేటీఆర్