జగిత్యాల, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం వచ్చిందంటేనే వారికి భయం. పక్కనే ఉన్న ఊరుకు వెళ్లేందుకు కిలోమీటర్ల కొద్దీ తిరిగివెళ్లాల్సిన దుస్థితి. వంతెనలు లేక దశాబ్దాల పాటు ఇలా నరకం అనుభవించిన జిల్లాలోని పలు గ్రామాల ప్రజల గోస స్వరాష్ట్రంలో తీరింది. నాడు వానకాలంలో వాగులు, పొంగి, నదులు ఉప్పొంగి రోజుల తరబడి ప్రయాణాలకు అంతరాయం కలిగినా, ప్రవాహాలు దాటే క్రమంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినా, పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజలు పట్టుబడి మరీ నాయకులను, అధికారులను అడ్డుకున్న సందర్భాల్లో ఒకటో, రెండో కాజ్వేలు (లో లెవల్ వంతెనలు) నిర్మించి చేతులు దులుపుకున్న సందర్భాలే అధికం. బాదనకుర్తి వంతెన, కమ్మునూరు, కలమడుగు లాంటి వంతెనలు సైతం తెలంగాణ ఉద్యమ కాలంలో విధిలేని పరిస్థితుల్లో నిర్మించబడినవే. రాష్ట్ర సాధన అనంతరం, జిల్లాలోని పలు మండలాల్లో వాగులు, వంకలపై వంతెనల కల నెరవేరింది. దాదాపు 150 కోట్ల వ్యయంతో ప్రతి మండలంలోనూ బ్రిడ్జిలు నిర్మించగా, ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది.
జిల్లాకు మకుటాయమానంగా బోర్నపెల్లి వంతెన
మహారాష్ట్ర నుంచి బంగాళాఖాతంలో కలిసే గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య నుంచి ప్రవహిస్తున్నది. అంటే నదికి ఉత్తరంగా ప్రస్తుత కొత్త జిల్లా నిర్మల్- దక్షిణంగా జగిత్యాల జిల్లాలు విస్తరించి ఉన్నాయి. పరీవాహక ప్రాంతం ఒడ్డున ఈ రెండు జిల్లాల్లోనూ ఎన్నో ఏళ్ల క్రితమే గ్రామాలు ఏర్పడ్డాయి. ఇందులో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపెల్లి గ్రామం గోదావరి నది పరీవాహక ప్రాంతం. రాయికల్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరు పక్క నుంచే నది ప్రవహిస్తున్నది. ఆవలి ఒడ్డున నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్నబెల్లాల విస్తరించి ఉంది. దాని పక్కనే పెద్ద బెల్లాల, చిట్యాల్, మొర్రిగూడెం, పెర్కపల్లి, పాండాపూర్, కన్నాపూర్, కడెం, ధర్మాజిపేట, అంబారిపేట, లక్ష్మీపూర్, దోస్నగర్, గంగాపూర్, దస్ర్తాబాద్, కల్లెడ, మద్దిపడిగె తదితర గ్రామాలున్నాయి. ఇవన్నీ కడెం మండలం పరిధిలోనే ఉన్నా బోర్నపెల్లికి 15 కిలోమీటర్ల దూరంల్లోనే ఉండడంతో ఎప్పటి నుంచో రెండు జిల్లాలోని ఆయా గ్రామాల మధ్య బంధుత్వాలు, స్నేహ సంబంధాలు కొనసాగాయి.
ఈ క్రమంలో నదిలో ప్రవాహం ఉన్న సమయంలో బోట్ల ద్వారా, ప్రవాహం లేని వేసవిలో కాలినడకన ప్రజలు అటూ, ఇటూ ప్రయాణించేవారు. అయితే కిలోమీటర్ మేర ప్రవహించే నదిని దాటే ప్రయత్నంలో పలు దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే కాలక్రమేణా బోటు ప్రయాణాలు తగ్గిపోయాయి. గోదావరిలో నీటి ప్రవాహం ఉంటే, పరీవాహక గ్రామాల ప్రజలు నిర్మల్ మీదుగా, రాయికల్ మండలానికి వెళ్లేవారు. కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న ఈ గ్రామానికి వచ్చేందుకు 80 నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి ఉండేది. అయితే కొన్నేండ్ల క్రితం కమ్మునూర్-కలమడుగు మధ్య వంతెన నిర్మించడంతో దూరభారం కొంత తగ్గినప్పటికీ పెద్దగా ప్రయోజనం మాత్రం కలుగలేదు. అయినా 60 కిలోమీటర్లు చుట్టుకొని రావాల్సి వచ్చేది. ఈ దూరాన్ని తగ్గించాలంటే, బోర్నపెల్లి-చిన్నబెల్లాల మధ్య వంతెన నిర్మాణం ఒక్కటే మార్గమని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే వంతెన కోసం దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులను వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
కానీ 2014లో ఎంపీగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత, నదిపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే బోర్నపెల్లి, చిన్నబెల్లాల మధ్య వంతెన నిర్మాణానికి 70 కోట్లు కేటాయించి పూర్తిచేయించారు. ఈ వంతెనతో రెండు జిల్లాల మధ్య దాదాపు 100 కిలోమీటర్ల దూర భారం తగ్గిపోయింది. దాంతో పాటు, నిర్మల్ జిల్లాలో మారుమూల మండలంగా గుర్తింపు పొందిన కడెం మండలానికి జగిత్యాల ప్రాంతంతో సంబంధాలు పెరిగిపోయాయి. కడెం మండలం నుంచి జగిత్యాల మధ్య కేవలం 45 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండడంతో మారుమూల మండలానికి వైద్య సౌకర్యం ఏర్పడింది. దాంతో పాటు, విద్యా సంస్థలు సైతం అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్కు వెళ్లేందుకు దూరభారం తగ్గింది.
ఏడేండ్లలోనే 32 బ్రిడ్జిలు
స్వరాష్ట్ర సాధన అనంతరం ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల నేతృత్వంలో జిల్లాలో పలు మండలాల్లో పెద్ద సంఖ్యలో వంతెనలు నిర్మించారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో 6.50 కోట్ల వ్యయంతో నాలుగు వంతెనలు నిర్మించారు. పెగడపల్లి మండలంలో 14.50 కోట్ల వ్యయంతో దేవికొండ, ల్యాగలమర్రి, పెగడపల్లి, మ్యాకవెంకయ్యపల్లి, నందగిరి, ఐతుపల్లి గ్రామాల్లో నిర్మించారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో ఎస్సారెస్పీ కెనాల్పై 1.10 కోట్లు, మెట్పల్లి వట్టివాగుపై 5.83 కోట్లు, మల్లాపూర్-గొర్రెపెల్లి మధ్య 2.15 కోట్లు, వెల్గటూర్ మండలం కోటిలింగాల, పాతగూడూరు-సూరారం, కొండాపూర్-శాఖాపూర్, జగదేవ్పేట-వెల్గటూర్ గ్రామాల మధ్య 8.17కోట్లతో నిర్మించారు. అలాగే ధర్మపురి- దమ్మన్నపేట, ధర్మపురి-నక్కలపేట మధ్య వంతెనలను 4.70 కోట్లు, మెట్పల్లి జగ్గసాగర్, వెల్లుల్ల-మెట్పల్లి మెట్పల్లి శివారులో 3 వంతెనలు 7.70 కోట్లతో నిర్మించారు. ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం-గోదూరు, గోదూరు-తిమ్మాపూర్, యా మాపూర్-వేములకుర్తి, ఎర్దండి- కొండాపూర్, ఇబ్రహీంపట్నం – కేశాపూర్, అమ్మక్కపేట-ఇబ్రహీంపట్నం గ్రామాల మధ్య 16 కోట్లతో 6 వంతెనలు నిర్మించారు. కొడిమ్యాల మండలం కొడిమ్యాల సూరంపేట మధ్య, పోతారం పీడబ్ల్యూ రోడ్డు నుంచి పోతారం దాకా 2 వంతెనలను 3.80 కోట్లతో నిర్మించారు. మల్యాలలో మ్యాడంపెల్లిలో 2.30 కోట్ల వ్యయంతో నిర్మించారు. జిల్లాలో మొత్తం 32 వంతెనలు నిర్మించి, ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చేశారు.