కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 24 : పీఎంవీవైఎస్ పథకానికి జిల్లాలోని అర్హులైన వివిధ చేతి వృత్తిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, స్వర్ణకార, మేదరి, ఉప్పరి, వెదురు బుట్టలు అల్లేవారు, బొమ్మలు వేసేవారు, రజకులు, నాయీబ్రహ్మణులు, దర్జీలు, చేపల వలలు తయారు చేసేవారు, పూలు అల్లేవారితోపాటు 18 రకాల చేతి వృత్తులు చేసుకునే వారంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన వారు కామన్ సర్వీస్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఈ పథకంలో ఎంపికైన వారికి నైపుణ్య ధ్రువీకరణ పరీక్షలు నిర్వహిస్తామని, అనంతరం 15 రోజుల పాటు అధునాతన శిక్షణ ఉంటుందని వెల్లడించారు. రూ.15 వేల విలువైన పరికరాలు అందించి, బ్యాంకు ద్వారా మొదటి విడుత రూ.లక్ష, రెండో విడుతలో రూ.2లక్షల రుణం అందించనున్నట్లు పేర్కొన్నారు.