కమాన్చౌరస్తా/మానకొండూర్/మానకొండూర్ రూరల్/హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 29: జిల్లా వ్యాప్తంగా గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. 56 పరీక్షా కేంద్రాల్లో 15,361 మంది విద్యార్థులకు గానూ 15,027 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 334 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని పలు కేంద్రాలను డీఐఈవోతో పాటు డీఈసీ సభ్యులు, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు పరిశీలించారు.
మానకొండూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 121 మంది విద్యార్థులకు గానూ 119 మంది పరీక్షకు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. దేవంపల్లి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో 159 మంది విద్యార్థులకు గానూ 148 మంది హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో 805 మంది విద్యార్థులకు గానూ 777 మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 28 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.