పెద్దపల్లి, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ నిర్వహణకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు నిర్వహించనుండగా, అందుకు కావల్సిన నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. కెమిస్ట్రీ, బయోలజీకి సబ్జెక్టులకు సంబంధించి పలు రకాల ప్రయోగాలకు వివిధ పరికరాలు, కెమికల్స్, ఇతరత్రా వస్తువులు అవసరం ఉంటాయి.
అయితే వాటిని సమకూర్చుకోవడం ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు భారంగా మారుతున్నది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 14 ఉన్నాయి. వీటిలో 3,467మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో విద్యార్థికి కాలేజీ మెయింటనెన్సీ ఖర్చుల కింద 38 చొప్పున 1,31,746ల నిధులను ప్రభుత్వం విడుదల చేయగా, విద్యార్థులు, కళాశాలల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ వచ్చే నెలలో నిర్వహిస్తాం. అయితే కళాశాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను త్వరలోనే ఆయా కాలేజీల ఖాతాల్లోకి జమ చేస్తాం. ప్రయోగాలకు సంబంధించి రసాయనాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు ఈ నిధులను వినియోగించుకోవాల్సి ఉంటుంది.
– దాసరి కల్పన, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ (పెద్దపల్లి)