లెక్కలు అనగానే మనం భయపడతాం. అమ్మో.. చాలా హార్డ్ అని అంటాం. కానీ కొన్ని మెళకువలు తెలిస్తే చాలా ఈజీ అని చెబుతున్నారు ఈ ఉపాధ్యాయులు. ముగ్గులతో గణితం చెబుతూ పిల్లల్లో ఆసక్తి పెంచుతున్నారు వేములవాడ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల టీచర్స్. రంగురంగుల రంగవల్లులతో కూడిన గణితాన్ని విద్యార్థులకు సులువుగా బోధిస్తూ మ్యాథ్స్పై భయాన్ని తొలగిస్తూనే వారిలోని సృజనాత్మకతను వెలిగితీస్తూ గణితం వైపు మళ్లిస్తున్నారు.
– వేములవాడ, జనవరి 22
వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 6వతరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను అందిస్తున్నారు. ఇందులో 420మంది విద్యార్థులు ఉండగా 280మంది బాలికలు చదువుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుహాసిని, గణితశాస్త్ర బోధకులు హరికృష్ణ, మాధవి గణితశాస్త్రంలో విద్యార్థుల్లో ఉన్న భయాలను తొలగించేందుకు వినూత్న పద్ధతిలో అర్థమయ్యేలా బోధిస్తున్నారు. గణిత దినోత్సవం రోజున రంగవల్లులతో కూడిన లెక్కలను విద్యార్థులతో వేయించి వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారు. దాదాపు 80మంది విద్యార్థినులు ఇందులో ఉత్సాహంగా పాల్గొని వారి సృజన్మాతకతకు పదును పెట్టారు.
రంగవల్లులతో కూడిన బోధన
పాఠశాలలోని విద్యార్థులకు రంగవల్లులతో కూడిన బోధన చేశారు. ఇందులో విద్యార్థులు రేఖాగణిత భావనలు, జ్యామితీయ పటాలు, సౌష్టవాలు వంటి అంశాలపై ముగ్గులుగా వేశారు. ఈ విధంగా బోధించడంతో గణితంపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు కూడా అందజేసి ప్రోత్సహిస్తున్నారు.
ముగ్గులతోనే లెక్కలు చేశాం
గణితశాస్త్ర దినోత్సవం రోజు పాఠశాలలో ఏర్పాటుచేసిన రంగవల్లుల గణితబోధనలో ముగ్గులతోనే లెక్కలు వేశాం. గణిత పరిక్రియల గుర్తులు, క్షేత్రగణిత ఆకారాల ఆధారంగా వేసిన ముగ్గు అందరిని మెప్పించి బహుమతి కూడా తెచ్చింది. ముగ్గుల ద్వారా లెక్కలు వేయడం సంతోషంగా ఉంది.
– కవిత, 10వ తరగతి విద్యార్ధి, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల వేములవాడ
రంగురంగుల ముగ్గులతో లెక్కలు వేశాం..
మ్యాథ్స్ అంటే భయమయ్యేది. మాకు రంగులతో ముగ్గులు వేయించి లెక్కలు చెప్పిండ్రు. ముగ్గులతో లెక్కలు చేయడం మంచిగ అనిపించింది. మేం వేసిన ముగ్గుకు ప్రైజ్ కూడా వచ్చింది. నాకు హ్యాపీగా ఉంది.
– జ్ఞాన సంహిత,10వ తరగతి విద్యార్ధి, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల వేములవాడ
విద్యార్థుల్లో భయాలు తొలగించేందుకు…
విద్యార్థుల్లో ఉన్న భయాలను తొలగించేందుకు సులువైన పద్ధతుల్లో వివరించేందుకు ఇలాంటి పద్ధతులను ఉపయోగించి బోధిస్తున్నాం. ఆటలు ఆడుకున్నట్లుగానే అందులో లెక్కలు కూడా ఉంటాయని తెలియజేసేందుకు రంగవల్లులు కూడా ఏర్పాటుచేశాం. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు కూడా అందజేశాం.
-సుహాసిని ప్రధానోపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల వేములవాడ
ముగ్గులలో కూడా లెక్కలు ఉంటాయని
చుక్కల ముగ్గులలోనే లెక్కలు కూడా ఉంటాయి. అలా వారికి లెక్కల్లో ఉన్న భయాలను తొలగించేందుకు ముగ్గులతో కూడిన లెక్కలను చేయించాం. విద్యార్థుల్లో ఈ ముగ్గులను వేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. దాదాపు 80మంది విద్యార్థినులు పాల్గొని వారిలోని భయాన్ని తొలగించుకున్నారు.
-మాధవి మ్యాథ్స్ ఉపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల వేములవాడ
విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది
పాఠాలు అర్థమయ్యే రీతిలో, సులువైన పద్ధతిలో బోధిస్తే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. లెక్కలు అంటే అందరిలోనూ భయం ఉంటుంది. అలాంటి భయాలను తొలగించడమే కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న ఆలోచనలు కూడా బయటకు వచ్చేందుకు ఉపయోగపడుతున్నాయి. లెక్కల్లో ఉన్న భయం పోయి ఆసక్తి పెరిగింది.
– హరికృష్ణ, ఉపాధ్యాయుడు, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల వేములవాడ