వరికి ‘తాటాకు’ చీడ దాపురించింది. ఇటీవల కురిసిన వర్షాలతో పుట్టుకొచ్చిన ఈ తెగులు క్రమంగా విస్తరిస్తున్నది. దీని ప్రభావంతో పైరు ఎండిపోయి, పంట నష్టపోయే ప్రమాదం పొంచి ఉండగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం అప్రమత్తమైంది. నివారణకు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నది.
జమ్మికుంట, ఆగస్టు 23: రాష్ట్రంలో రైతులు మేజర్గా వరి సాగు చేస్తారు. జూలై నుంచి ఆగస్టు చివరి వారం వరకు వరి నాట్లు వేశారు. అయితే గత 20-30 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు తెరిపిలేకుండా కురిసాయి. దీని వల్ల జూలైలో వరి నాట్లకు తాటాకు తెగులు (హిస్పా) సోకింది. ప్రతి మండలంలో 25 శాతానికి పైగా తెగులు ఉధృతి పెరిగింది. ఫలితంగా తెగులుతో ఆకులు ఎండిపోయే పంట నష్టపోయే అవకాశం ఉండగా, రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో పరిస్థితిని గుర్తించిన జమ్మికుంట కృషి విజ్ఞాన సేద్యవిభాగ శాస్త్రవేత్త జక్కుల విజయ్.. నివారణకు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
కారణాలు..
అధిక నత్రజని ఎరువులు వాడకం, వానాకాలం ముందు నుంచే మంచి వర్షాలు పడడం, తర్వాత బెట్ట పరిస్థితులు కారణం. ఇంకా పగటి, రాత్రి ఉష్ణోగ్రతుల మధ్య తక్కువ తేడా, గాలిలో అధిక తేమ, తదితర పరిస్థితుల వల్ల తెగులు ఉధృతికి దోహదపడతాయి. పిలకకు రెండు అంతకంటే ఎక్కువ పురుగులున్నప్పుడు చర్చలు తీసుకోవాల్సి ఉంటుంది. మందులు పిచికారి చేయాలి.
తాటాకు తెగులు..
పురుగు నల్లగా, చిన్నగా ఉండి శరీరం అంతా ముళ్లు కలిగి ఉంటుంది. సూర్యరర్శి పడ్డప్పుడు మెరుస్తూ ఉంటుంది. నారుమడి/పిలక దశలో పిల్ల, పెద్ద పురుగులు ఆకులను గీకి పత్రహరితాన్ని తినడం వల్ల తెల్లని, నిలువు చారలు ఏర్పడతాయి. దీని ప్రభావంతో ఆకులు ఎండిపోయి పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
నివారణ చర్యలు..
క్వినాల్ఫాస్ 2మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ 2మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటరు నీటికి కలిపి సకాలంలో పిచికారి చేసుకోవాలి. లేదంటే తెగులు బారినపడ్డ పంటతో రైతులు నష్టపోవాల్సి ఉంటుంది. ఇదే కాదు జింక్లోపానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
జింకు దాతు
దాతు లోపం వల్ల వరి పై నుంచి కింది వరకు 3లేదా 4 ఆకుల్లో మధ్య ఈనే పాలిపోతుంది. ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివర్లలో మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా పెళుసుగా మారతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. దీని సవరణకు ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి, లేనిచో ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20కిలోల జింకు సల్ఫేటు వేసుకోవాలి.
నివారణ చర్యలు..
పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2గ్రాముల జింకు సల్ఫేటు కలిపి 5రోజుల వ్యవధిలో 2 నుంచి 3సార్లు పిచికారి చేయాలి.