కలెక్టరేట్, ఆగస్టు 16: భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఇండియా సాఫ్ట్ సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని గీతాభవన్ చౌరస్తా వద్ద నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో విద్యార్థులు, నగరవాసులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి తరానికి స్వాతంత్య్ర ఉద్యమంపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకే 15 రోజులపాటు వజ్రోత్సవాలను నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర పోరాట యోధులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ చరిత్రను కొంతమంది వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మహాత్ముడి చరిత్రను నేటితరానికి తెలిపేందుకు రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో మహాత్మా గాంధీ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. సీమాంధ్రుల పాలనలో వెనుకబడిన తెలంగాణ అభివృద్ధి, స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎనిమిదేండ్లలోనే అరశతాబ్ధపు పురోగతి సాధించిందని చెప్పారు. యావత్ దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిచిందన్నారు. యువతతోనే ఏదైనా సాధ్యమవుతుందని గత చరిత్ర చెబుతున్నదని, దేశంలోని యువత ముందుకొచ్చి భారత్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, అధికసంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు.