కార్పొరేషన్, జనవరి 11: రైతులు వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తితో ఆదాయం మెరుగుపరుచుకోవచ్చని భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (బీఏఐఎఫ్) చైర్మన్ భారత్ కాక్డే సూచించారు. కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో బుధవారం పాల ఉత్పత్తిదారులకు కుటుంబ సభ్యులకు డెయిరీ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను నగర మేయర్ యాదగిరి సునీల్రావు, కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్రావుతో కలిసి బీఏఐఎఫ్ చైర్మన్ కాక్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చైర్మన్ రాజేశ్వర్రావు నేతృత్వంలో కరీంనగర్ డెయిరీ జీరో స్థాయి నుంచి నంబర్ వన్ స్థాయికి ఎదిగిందన్నారు. 2001 నుంచి కరీంనగర్ డెయిరీతో బీఏఐఎఫ్ అనుబంధం కొనసాగుతున్నదని, పాల ఉత్పత్తిని పెంచేందుకు జాతి పశువులను సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషించిందన్నారు.
డెయిరీలో పరిధిని రైతులకు దూడలను మాత్రమే ఉత్పత్తి చేసేందుకు బీఏఐఎఫ్ లింగనిర్ధారణ చేసిన వీర్యాన్ని సరఫరా చేస్తున్నదన్నారు. మేయర్ మాట్లాడుతూ, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను అందించేందుకు డెయిరీ ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నదని తెలిపారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారని, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. డెయిరీ చైర్మన్ మాట్లాడుతూ, రెండేళ్ల విరామం తర్వాత సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగోలీ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులను అభినందించారు. డెయిరీ ఉత్పత్తులను హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం 34 మిల్క్ కూలింగ్ యూనిట్ల వారీగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లోని విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో చలిమెడ వైద్య విద్యా సంస్థ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, డెయిరీ ఎండీ పీ శంకర్రెడ్డి, సలహాదారు వీ హనుమంతరెడ్డి, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.