ధర్మపురి, నవంబర్ 3: దళితుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని, గురువారం ధర్మపురిలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో నియోజకవర్గంలోని దళితులందరికీ హుజూరాబాద్ తరహాలో ఒకేసారి దళితబంధు ఇస్తామని ప్రకటించడం హర్షనీయమని ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మపురి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
హుజురాబాద్లో 18వేల దళిత కుటుంబాలకు దాదాపు రూ.2వేల కోట్లు ఖర్చు చేసి దళిత బంధు ఇచ్చారని, అక్కడి దళితులంతా పలురకాల వ్యాపారాలు చేసుకుంటూ యజమానులుగా మారిపోయారని చెప్పారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ధర్మపురిలో కూడా అక్కడి మాదిరే ఇస్తామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో దాదాపు 20వేల దళిత కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాంత దళిత కుటుంబాల పక్షాన సీఎం కేసీఆర్కు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. ఒక దళిత ఎమ్మెల్యేగా దళితులందరికీ దళితబంధు వర్తింపజేయడం అంటే జీవితానికి ఇంతకంటే సార్థకత ఏముంటుందన్నారు.
సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే అది రామబాణం వేసినట్లేనన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని హామీలను సైతం అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని కీర్తించారు. సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచా రాలను దళిత కుటుంబాలు తిప్పికొట్టాలని, వచ్చే ఎన్నికల్లో ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థినైన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ధర్మపురిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మంత్రి ఈశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానంతో ఒక్క పిలుపుతో నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి తండోపతండాలుగా సభకు తరలివచ్చారని, వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా.శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ చిట్టిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, జడ్పీటీసీ అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్ తదితరులు ఉన్నారు.