Banda Srinivas | హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 19: బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో చేరలేదని ప్రగల్భాలు పలుకుతున్నారని, వాస్తవంగా వారు పార్టీ మారకుంటే ఈ నెల 21న జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ సవాల్ విసిరారు.
హుజురాబాద్ లోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. గెలిపించిన ప్రజలను మోసం చేస్తూ పార్టీ మారి ఇప్పుడు చర్యలు తీసుకునే సమయానికి తము పార్టీలు మారలేదంటూ దొంగ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజంగా పార్టీ మారితే దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు పొంది కష్టకాలంలో పార్టీని వదిలి పోవడం సిగ్గుచేటని హెద్దేవా చేశారు. ఇప్పటికైనా పార్టీ నుంచి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పడంలో నిజాయితీ ఉంటే తప్పక బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని డిమాండ్ చేశారు. ఒకవేళ హాజరు కాకపోతే వారు పార్టీ మారిన ప్రజా ప్రతినిధులుగా మిగిలిపోతారని చెప్పారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు ప్రజల ముందు దోషులుగా నిలబడతారని, భవిష్యత్ లో వారికి తగిన గుణపాఠం కూడా ప్రజలు చెబుతారని హెచ్చరించారు.