Peddapally Bar Association | పెద్దపల్లి, ఫిబ్రవరి 17: మళ్లీ ఎన్నికలు జరిగే వరకు పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తానే కొనసాగుతనని పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ తెలిపారు. పెద్దపల్లి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 ఏళ్లుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ పెద్దపల్లి బార్ అసోసియేషన్లో కొనసాగుతూ 6 సార్లు కార్యదర్శి, 3 సార్లు వరుసగా అధ్యక్షుడిగా తెలంగాణ బార్ కౌన్సిల్ నిబందనలకు లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనట్లు తెలిపారు. అందులో భాగంగా 2025 -2026 సంవత్సరానికి గానూ పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై, విధులు నిర్వహిస్తున్న క్రమంలో కొంతమంది సీనియర్ న్యాయవాదుల ప్రోద్బలంతో నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని అవేదన వ్యక్తం చేశారు.
తనకు ఎలాంటి నోటీసు లేకుండా తన వివరణ కొరకుండా, కార్య వర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో తాను పెద్దపల్లి నూతన కోర్టుల భవన సముదాయం నిర్మాణాన్ని రాఘవాపూర్ గ్రామ శివారులో చేయటాన్ని వ్యతిరేకిస్తూ చేసిన బార్ అసోసియేషన్ తీర్మాణానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నానని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ నిబందనలకు వ్యతిరేకంగా నన్న పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యత్వం నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ, బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలిగిస్తూ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడైన ఠాకూర్ అజయ్ క్రాంతి సింగ్ను అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు తీర్మానం చేయటం అన్యామన్నారు. ఈ విషయంపై తాను తెలంగాణ బార్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేయగా, బార్ కౌన్సిల్ ఇరుపక్షాలను పిలిపించి ఇరుపక్షాల వాదనలను విని, తన పై చేసిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని, ఆరోపణలకు ఎలాంటి సాక్షాదారాలు లేవని చెప్పారు. తనను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ చేసిన తీర్మాణాన్ని కొట్టివేస్తూ తెలంగాణ బార్ కౌన్సిల్ తీర్పు నివ్వడం జరిగిందని తెలిపారు.
వారు తెలంగాణ బార్ కౌన్సిల్ తీర్పుపై భారత బార్ కౌన్సిల్కు అప్పీలుకు వెళ్లగా, బారత బార్ కౌన్సిల్ తెలంగాణ బార్ కౌన్సిల్ తీర్పును తాత్కాలికంగా నిలిపి వేసినట్లు చెప్పారు. దీంతో తాను తెలంగాణ హైకోర్టులో సవాలు చేయగా, ఈ నెల 11న తెలంగాణ హై కోర్టు భారత బార్ కౌన్సిల్ తాత్కాలిక తీర్పును కొట్టి వేస్తూ తననే అధ్యకుడిగా కొనసాగే విధంగా తీర్పునిచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి అడ్వకేట్ బార్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ గౌరీశెట్టి సత్యనారాయణ, పుట్ట రవి, సీనియర్ న్యాయవాది దోనేటి కిష్టయ్య, వంగల రవీందర్, కొండ్ర నారాయణ, బుర్ల వంశీకృష్ణ, ఠాకూర్ రఘువీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.