పరిశుభ్రత, పౌష్టికాహారమే శ్రీరామరక్ష
ఇంటి పరిసరాల స్వచ్ఛత ప్రధానం
లేదంటే పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
విద్యానగర్, జూన్ 27: ప్రస్తుత ఆధునికయుగంలో మనిషి చాలా బిజీగా మారిపోతున్నడు. తన నిర్లక్ష్యంతో తన చుట్టూ ఉండే పరిసరాలను కలుషితం చేస్తున్నాడు. వెరసి రోగాల బారినపడుతున్నాడు. ఇది ఎంతమాత్రం మంచిది కాదని ప్రశాంతమైన జీవితానికి పౌష్టికాహారం.. పరిశుభ్రత చాలా ముఖ్యమని, ఆరోగ్యానికి ఈ రెండే ప్రధానమని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా ఏమన్నారంటే.. అనేక వ్యాధులు అపరిశుభ్రత కారణంగానే వస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో గతంతో పోల్చితే అపరిశుభ్రత తగ్గింది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం చెత్త కుండీలు, కంపోస్ట్ పిట్స్ ఏర్పాటు చేసినా కొందరు చెత్తా చెదారాన్ని రోడ్లపై పారబోస్తుండడంతో అపరిశుభ్రత పెరిగిపోతున్నది.
రోగాల ముప్పు పొంచి ఉంటున్నది. ఈ క్రమంలో చెత్తను కేటాయించిన పాయింట్లలోనే పడేసేలా అధికారులు చొరవచూపాలి. ఇంకా టైంకు భోజనం చేయకపోవడం, జంక్ ఫుడ్కు అలవాటు పడడం వంటివి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వీటిన్నింటినీ వదిలేయాలి. టైంకు భోజనం చేయాలి. ఆకుకూరలు, కూరగాయలు వంటి పోషకపదార్థాలు భోజనంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.