హుజూరాబాద్ టౌన్, ఫిబ్రవరి 16: హుజూరాబాద్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. నియోజకవర్గంలో సాగునీటి గోసను తీర్చాలని, కల్వల ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన 70 కోట్ల నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 8,500 ఎకరాలకు నీళ్లు అందుతాయని చెప్పారు.
అలాగే హుజూరాబాద్, జమ్మికుంటలో ఇంటిగ్రేటెడ్ మారెట్ కోసం 16 కోట్లు అవసరమని, ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఉప్పల్, శనిగరం, చల్లూర్, వావిలాల గ్రామాలను కొత్త మండలాలు చేయాలని కోరారు. 1200 సీఎంఆర్ఎఫ్ ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా క్లియర్ చేయాలన్నారు. 72 వీవోల బిల్డింగులు కూడా పూర్తిచేయాలని కోరారు.
హుజూరాబాద్ చిలుకవాగు బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ పూర్తయిందని, దాని పనులు పూర్తి చేయాలన్నారు. బల్దియా పరిధిలోని బోర్నపల్లి నుంచి ఇప్పల్నర్సింగాపూర్కు వెళ్లే రోడ్డు నిర్మాణానికి టెండర్ పూర్తయిందని, పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే హుజూరాబాద్లో చాలా కుల సంఘాలకు భవనాలు కేటాయించామని, అందులో పద్మశాలీ, రెడ్డి, వైశ్య తదితర భవనాలు దాదాపు పూర్తయ్యాయని, మిగతా కుల సంఘాల భవనాలు కూడా కట్టించేందుకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. వానకాలంలో కురిసిన వర్షాలకు చాలా చెక్ డ్యాములు దెబ్బతిన్నాయని, వాటిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు.