ఆస్తి పన్నుల వసూళ్లలో హుజూరాబాద్ బల్దియా దూసుకెళ్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను శతశాతమే లక్ష్యంగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 3కోట్లా 51లక్షలా 64వేలు టార్గెట్ కాగా, మార్చి 27 నాటికే 2కోట్లా 43లక్షలా 49వేల పన్నులు వసూలు 69.24 శాతంతో జిల్లాలోనే టాప్లో కొనసాగుతున్నది. మిగిలిన రెండురోజుల్లో టార్గెట్ను చేధించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తామని యంత్రాంగం దీమాగా చెబుతున్నది.
హుజూరాబాద్టౌన్, మార్చి29: ఆస్తి పన్ను వసూళ్లలో హుజూరాబాద్ బల్దియా దూసుకెళ్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను శతశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా పురపాలక అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే (సోమవారం) వరకు 69.24శాతం పన్ను వసూళ్లు సాధించి జిల్లాలో ముందంజలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ శుక్రవారం ప్రకటించిన ఆన్లైన్ జాబితాలో రాష్ట్ర స్థాయిలో టాప్-14లో కొనసాగుతున్న ది. అధికారులు ఇంటి, నల్లా, తై బజార్ పన్ను లు వసూలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రసార మాధ్యమాలు, మున్సిపల్ వాహనాలు, ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు సైతం పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ, ఇంటింటికీ వెళ్తున్నారు. పాత బకాయిలు చెల్లించడంలో మొండిగా వ్యవహరిస్తున్న గృహ యజమానులకు రెడ్ నోటీసులు అందిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందం గా ఆస్తి, నల్లా, తైబజార్ పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ముందంజలో ఉన్న మున్సిపాలిటీ మిగిలిన రెండు రోజుల్లోనే లక్ష్యాన్ని సాధించి, రాష్ట్రంలోనే టాప్ 5లో నిలుస్తుందని అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు.
హుజురాబాద్ పట్టణ జనాభా 2011 జనా భా లెకల ప్రకారం సుమారు 34.555 ఉంది. పట్టణంలో 8,565 వాణిజ్య సముదాయాలు, నివాస గృహాలు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 3కోట్ల 51లక్షల 64వేల పన్నులు వసూలు చేయాలని పురపాలక అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 27 నాటికి 2కోట్ల43లక్షల49వేల పన్నులు వసూలు చేసి 69.24 శాతం నమోదుతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఓ నగరపాలక సంస్థలను దాటి ముందంజలో ఉంది. ఆస్తి పన్నులు 2కోట్ల28లక్షల61వేలకుగాను కోటీ99లక్షల 24వేలు (87.15శాతం) వసూ లు చేయగా, ఇంకా రూ.29.37లక్షలు వసూలు చేయాల్సి ఉంది. అలాగే నల్లాల(వాటర్ టాక్స్) పన్నులు కోటి11లక్షలకు 32.22లక్షలు (29.02శాతం) వసూలు చేయగా ఇంకా 68. 78లక్షలు వసూలు చేయాల్సి ఉంది. అలాగే తై బజార్ పన్నుల వసూళ్లలో 12.03లక్షలకు వందశాతం వసూలు చేశారు.
పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. మొండి బకాయిల వసూళ్ల కోసం పది మందికిపైగా యజమానులకు రెడ్ నోటీస్ అందించాం. గడువులోగా వంద శాతం పన్నులు వసూ లు చేస్తామన్న ధీమాతో ఉన్నాం. సకాలంలో చెల్లించడం ద్వారా అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించి వసూలు చేస్తున్నాం.
– సల్వది సమ్మయ్య, కమిషనర్ (హుజూరాబాద్)
బల్దియా విలీన గ్రామాల్లో కొందరు పన్నులు చెల్లించేందుకు ససేమిరా అంటున్నారు. అలాంటి వారిని చైతన్య పరిచి వసూలు చేస్తున్నాం. పట్టణంలో దాదాపుగా 90శాతం వసూలు కాగా కేవలం విలీన గ్రామాలైన కొత్తపల్లి, బోర్నపల్లి, ఇప్పలనర్సింగాపూర్, దమ్మక్కపేట గ్రామాలల్లో 50శాతమే రాబట్టాం. ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లిస్తే శత శాతంతో ముందు వరుసలో నిలుస్తాం.
– బండ మోహన్, బిల్ కలెక్టర్(హుజూరాబాద్)