హుజూరాబాద్, ఏప్రిల్ 11 : హుజూరాబాద్ ఏటీఎంలో చోరీ చేసిన దొంగలు దొరికారు. సినిమా సీన్ను తలదన్నేలా స్కెచ్ వేసి దొంగతనం చేసినా.. తప్పించుకోలేకపోయారు. ఇక్కడ 8.64 లక్షలు ఎత్తుకెళ్లి, హర్యాణాలో పంచుకోగా.. ఎట్టకేలకు పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను హుజూరాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ జీ వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన తారీఫ్కు లారీ ట్రాన్స్ఫోర్ట్ ఆఫీస్ ఉన్నది. ఆయనకు సొంతంగా లారీ కంటెయినర్ (ఆర్జే 11 జీబీ 7370) కూడా ఉన్నది.
హర్యాణాకు చెందిన అన్నదమ్ములు సపత్, ముషారఫ్ రాజస్థాన్లోనే లారీ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సాజిద్ కూడా అక్కడే వెల్డింగ్ పనులు చేస్తుండగా, వీరంతా ఎక్కడైనా ఏటీఎంలో చోరీ చేయాలని అనుకున్నారు. అందుకు ముందుగానే అంతా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అక్కడే లేబర్లుగా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన ఆఫ్తాబ్, హర్యాణాకు చెందిన ఫరీద్ను సహాయకులుగా తీసుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ నెల 17న ఈ ఆరుగురు రాజస్థాన్ నుంచి విజయవాడకు గ్యాస్ స్టవ్ల లోడ్తో వెళ్లి, తిరిగి ఈ నెల 18న వరంగల్ మీదుగా హుజూరాబాద్కు చేరుకున్నారు. పరకాల క్రాస్రోడ్ వద్ద ఉన్న రాజస్థాన్ దాబాలో భోజనం చేశారు.
అప్పటికే దొంగలించిన మోటర్ సైకిల్, మారుతీ కారులో తిరుగుతూ.. ఏటీఎంలో చోరీ చేసేందుకు అర్ధరాత్రి దాకా రెక్కీ నిర్వహించారు. కోర్టు సమీపంలో ఉన్న ఏటీఎంలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు ఆ ఏటీఎం వద్ద ఆఫ్తాబ్ కాపలాగా ఉండగా.. ఫరీద్ సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ స్ప్రే చేశాడు. ఆ తర్వాత సపత్, సాజిద్ గ్యాస్ కట్టర్తో ఏటీఎంను పగులకొట్టి, అందులో ఉన్న 8,64,100 కొల్లగొట్టారు. అప్పటికే తుమ్మనపల్లి వద్ద కంటెయినర్తో సిద్ధంగా ఉన్న ముషారఫ్ దగ్గరకు వెళ్లి, మోటర్సైకిల్, కారును అక్కడే వదిలేశారు.
తర్వాత అందరూ కలిసి కంటెయినర్తో హర్యాణాకు వెళ్లి.. దొంగిలించిన సొమ్మును పంచుకున్నారు. ఈ ఘటనపై ఏటీఎం కేంద్రాల్లో పనిచేస్తున్న హైదరాబాద్కు చెందిన తేలుకుంట్ల శ్రీనివాస్చారి ఫిర్యాదు చేయగా..పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. పట్టణ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం సభ్యులు రంగంలోకి దిగారు. చోరీ చేసిన తీరును బట్టి ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని అనుమానించారు. ఆ మేరకు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో వెతికారు. ఆ ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు.
కామారెడ్డి ప్రాంతంలో కంటెయినర్తో వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడాన్ని గమనించారు. అది కరీంనగర్వైపు వెళ్లినట్లు గుర్తించి ఆ నంబర్ను నోట్ చేసుకున్నారు. ఈ సమాచారం మేరకు బుధవారం కరీంనగర్ బైపాస్ (ఎన్టీఆర్ చౌరస్తా)లో కంటెయినర్ వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. హైదరాబాద్ వెళ్తున్న ఆ కంటెయినర్ను ఆపి, తనిఖీ చేశారు. అనుమానంతో డ్రైవర్ ముషారఫ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. చోరీ చేసింది తామేనని ఒప్పుకోవడంతో అరెస్ట్ చేశారు. త్వరలోనే మిగతా వారిని పట్టుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు. సమావేశంలో టౌన్ సీఐ రమేశ్, ఎస్ఐ సాంబయ్య, ఐడీ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.