కరీంనగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్లోని మార్క్ఫెడ్ స్థలంలో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. కరీంనగర్లోని మార్క్ఫెడ్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర మార్క్ఫెడ్ 24వ పాలకవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువు రు సభ్యులు మాట్లాడుతూ, కరీంనగర్లోని 38 ఎకరాల మార్క్ఫెడ్ స్థలంలో మంచి ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని మంత్రి దృష్టికి తెచ్చారు. దీని పై స్పందించిన ఆయన, ఈ భూమి చాలా విలువైనదని, రైతులు, ప్రజలకు ఉపయోగపడేలా ప్రా జెక్టు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భావి తరాలకు సైతం పూర్తి ప్రయోజనకరంగా ఉండాలని సూచించారు.
మార్చి 2 వరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అదేరోజు ఈ విషయమై మరోసారి సమీక్ష నిర్వహిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఎరువులు ము ఖ్యంగా యూరియా బఫర్ నిల్వలు గడ్డ కట్టి చెడిపోతున్నాయని, దీనిపై ఆలోచించాలని పలువురు సభ్యులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై అమాత్యుడు స్పందించి, ఇది ప్రభుత్వ నిర్ణయమని, ఎరువుల కొరత ఏర్పడిన సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు బఫర్ నిల్వలు చేస్తున్నదని వివరించారు. ఈ విధానాన్ని మార్చలేమని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా నానో లిక్విడ్ యూరియాను ప్రోత్సహించాలని కోరారు. సాధారణ యూరియా కంటే ఇది తక్కువ ధరలో లభిస్తుందని, రైతులందరికీ స్ప్రే చేయించడం అలవాటైతే దేశీయంగా తయారయ్యే నానో యూరియానే ఎంతో మేలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కాలానికి అనుగుణంగా మార్క్ఫెడ్లో మార్పులు చేసుకోవాలని, వ్యాపార రంగంలో మరింత ముందుకు సాగాలన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకోవాలని, ఈ దిశగా అధికారులు, పాలకవర్గ సభ్యులు ఆలోచనలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎండీ పీ యాదిరెడ్డి, డీసీఎమ్మెఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, డైరెక్టర్లు రామస్వామి, మోహన్, లింగయ్య, మార్క్ఫెడ్ ప్రొడక్షన్ మేనేజర్ చంద్రశేఖర్, ఫర్టిలైజర్ చీఫ్ మేనేజర్ బీ రేఖ, జీఎం విష్ణువర్ధన్, హెచ్ఆర్డీ మేనేజర్ వెంకట్రామిరెడ్డి, డీఓ టెక్నికల్ ప్రద్యుమ్న, కరీంనగర్ డీఎం ఎస్ ప్రవీణ్ రెడ్డి, వివిధ జిల్లాల డీఎంలు పాల్గొన్నారు.