ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతున్నది. వానకాలం మొదలైనప్పటి నుంచి నీరు రాక, ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులను కలవర పెట్టిన ఎస్సారెస్పీ కొద్ది రోజుల నుంచి జలకళ సంతరించుకుంటున్నది. ఇటీవలే కాళేశ్వరం జలాలను ఎత్తిపోయగా, నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తుతున్నది. శనివారం రాత్రి నుంచే 1.38 లక్షల క్కూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడం, గంట గంటకూ ప్రవాహం పెరిగి 1,74,795 క్యూసెక్కులకు చేరడంతో కేవలం 12 గంటల వ్యవధిలోనే రిజర్వాయర్లోకి 10 టీఎంసీల నీరు చేరింది. సాయంత్రానికి కల్లా ఇన్ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టి, స్థిరంగా కొనసాగుతుండడం, ఇప్పటికే 57టీఎంసీల నీరు చేరడంతో ఆయకట్టు పరిధిలోని ఉమ్మడి జిల్లా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. – జగిత్యాల, జూలై 22 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఉత్తర తెలంగాణ రైతాంగానికి ఈ సంవత్సరం మహర్దశ పట్టనుంది. వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 48 గంటల నుంచి వరద పోటెత్తుతుండడంతో నీటి మట్టం వేగంగా పెరుగుతున్నది. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగు, తాగునీరు అందుతున్న విషయం తెలిసిందే. 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిండని ప్రతిసారి రైతాంగానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రాజెక్టు క్రమంగా వట్టిపోతుండడం, ఎగువన మహారాష్ట్ర వాళ్లు గోదావరిపై విచ్చలవిడిగా ప్రాజెక్టులు, బరాజ్లు నిర్మిస్తుండడంతో భూములకు సాగునీరందని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, దానికి అనుబంధంగా వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీని నింపాలని నిర్ణయించి, ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని సక్సెస్ సాధించారు. ఈ సీజన్లో జూన్ ప్రారంభం నాటికి ఎస్సారెస్పీలో చాలా తగ్గిపోవడం, జూలై సమీపించినా వర్షం జాడ ఇటు తెలంగాణలోను, అటు మహారాష్ట్రలోనూ కానరాకపోవడంతో రైతాంగం తీవ్ర నిరాశకు లోనైంది. వరినాట్లు వేసుకునే అదును దాటిపోతుందని రైతులు ఆవేదనకు చెందుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద జలాలు తరలించాలని ఆదేశాలు జారీ చేయగా, జూలై మొదటి వారం నుంచి కాళేశ్వరం నుంచి జలాలను తరలించడం మొదలు పెట్టారు.
లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ, ఎల్లంపల్లి బరాజ్లు, నంది, గాయత్రీ పంప్హౌస్ల మీదుగా వరద కాలువకు తరలించిన జలాలను మల్యాల మండలం రాంపూర్ పంప్హౌస్, మెట్పల్లి మండలం రాజేశ్వరావు పంప్హౌస్ నుంచి ఎస్సారెస్పీలోకి ఎత్తిపోశారు. ఈ క్రమంలో నిండుగా మారిన వరద కాలువకు అనుసంధానంగా ఉన్న చెరువులను తూముల ద్వారా నింపి, ఆయా చెరువులపై ఆధారపడి ఉన్న గొలుసు కట్టు చెరువులను నింపారు. కాళేశ్వరంలోకి 2.536 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా తరలించారు. అయితే ఎస్సారెస్పీలోకి ఎగువ నుంచి నీటి ప్రవాహం మొదలు కావడం, ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు చేరడంతో ఎస్సారెస్పీ పునర్జీవ ఎత్తిపోతలను నిలిపివేశారు.
శరవేగంగా నిండుతున్న ప్రాజెక్టు
వానకాలం ప్రారంభమై నెలన్నర గడిచిపోయిన 90.30 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్సారెస్పీలోకి ఆశించిన మేర నీరు చేరకపోవడంతో కలత చెందిన ఉమ్మడి జిల్లా రైతాంగం మూడు రోజులుగా ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. వరద నీటి ప్రవాహం ఆయకట్టు రైతుల్లో ఉత్సాహం నింపుతున్నది. గురువారం నుంచి ప్రాజెక్టులోకి మహారాష్ట్ర ప్రాంతంతోపాటు ఎస్సారెస్పీ క్యాచ్మెంట్ ఏరియాల నుంచి నీటి ప్రవాహం మొదలైంది. నిజామాబాద్తోపాటు స్థానిక వాగుల నుంచి ప్రవాహం భారీగా వస్తున్నది. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలోని బాబ్లీ, దానికి ఎగువ భాగంలో ఉన్న విష్ణుపురి ప్రాజెక్టుల పరిధిలోను వర్షాలు కురవడంతో అక్కడి నుంచి పోటెత్తుతున్నది.
ఒక్కరోజే పది టీఎంసీలు రాక..
ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి శనివారం ఒక్కరోజే పది టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరడం గమనార్హం. శనివారం రాత్రి 12.00 గంటలకు ప్రాజెక్టులోకి 1,38,512 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 1077.80 అడుగులతో 46.69 టీఎంసీల నీరు ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో లక్షకు పైగా క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగింది. ఉదయం అధికారులు 1079 అడుగులతో 49.968 టీఎంసీలకు నీరు చేరినట్లు ప్రకటించారు. కేవలం ఆరుగంటల వ్యవధిలోనే ఐదు టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. ఉదయం 8 గంటల వరకు ఇన్ఫ్లో పెరిగి 1,49,995 క్యూసెక్కులకు పైగా వరద రాగా, 51.049 టీఎంసీలకు నీరు చేరుకుంది. 10 గంటల వరకు ప్రాజెక్టులోకి 1080.10 అడుగులతో 52.684 టీఎంసీల నీరు చేరుకోగా, 1,49 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో స్థిరంగా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం మరింతగా పెరిగిపోయింది. 1,74,795 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అప్పటికే 54.387 టీఎంసీలకు చేరుకుంది.
సాయంత్రం ఐదు గంటల వరకు సైతం ప్రాజెక్టులోకి అంతే మొత్తంలో నీటి ప్రవాహం స్థిరంగా కొనసాగుతూనే ఉంది. 1081.41 అడుగులతో 56.374 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం కాస్తా తగ్గుముఖం పట్టింది. ఆరుగంటల వరకు 1081.60 అడుగులతో 56.94 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరుకోగా, 1,57,496 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి జూన్ 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 33 టీఎంసీలకు పైగా నీరు చేరుకుంది. కాగా శనివారం రాత్రి మొత్తం ఇలాగే ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వరద ఇలాగే కొనసాగితే, రేపటి వరకు 60 టీఎంసీలకు పైగా నీరు ప్రాజెక్టులోకి చేరే అవకాశం ఉందంటున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు మరోసారి జలకళను సంతరించుకోవడంతో రైతులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు దిగువన తొలి ప్రాంతంలో ఉన్న జగిత్యాల జిల్లా రైతులు గతేడాదికి మించి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే పరిస్థితులు ఉంటాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలకు తాగునీటికి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది.