MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, మార్చి 12 : సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ దోహదం చేస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్లకుంట్ల అన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందన్నారు.
కోరుట్ల నియోజకవర్గంలోని 15 ఏండ్లలోపు బాలికలకు జనరల్ దవాఖాన, ఏరియా దవాఖానల్లో హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాతో లబ్ధికలిగే ప్రయోజనాలను ఇతరులకు వివరించే బాధ్యతను బాలికలు తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ హెచ్పీవీ టీకాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకుముందు ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
గర్భిణీల సౌకర్యం కోసం ఆసుపత్రిలో అధునాతన స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈఎన్టీ పరీక్షలకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చుకోవాలని, అవసరమైన నిధుల సమీకరణకు కృషి చేస్తానని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అంతకుముందు ఆసుపత్రిలో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి శానిటేషన్ సామగ్రిని ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు తిరుమల వసంత, ఉపాధ్యక్షుడు మమ్మద్ షాహిద్ ఉల్హాద్, కౌన్సిలర్లు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుజాత, ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత, డీసీహెచ్ రామకృష్ణ, వైద్యులు వినోద్, ఇంతియాజ్ అలీ, రమేష్, ఫార్మసిస్ట్ ఆఫీసర్ ఉదయ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.