ధర్మపురి/వేములవాడ టౌన్, జనవరి 1: ముక్కోటి ఏకాదశి వేడుకలకు ధర్మపురి నృసింహుడి, వేములవాడ రాజన్న క్షేత్రాలు ముస్తాబయ్యాయి. సోమవారం అంగరంగవైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం, పాలకవర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశముండడంతో ప్రత్యేక క్యూలైన్లను సిద్ధం చేసింది. రాజగోపురాలు, ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించింది. ఆలయ ప్రధాన ద్వారం వద్ద కరెంట్ బల్బులతో కూడిన నరసింహస్వామి కటౌట్లను ఏర్పాటు చేసింది.
భక్తుల అవసరం మేరకు నీటి వసతిని కల్పించింది. పులిహార, లడ్డూ ఇతర ప్రసాదాలను సిద్ధం చేసింది. ధర్మపురిలో ఏర్పాట్లను సహాయ కమిషనర్, ధర్మపురి ఆలయ సీఈవో సంకటాల శ్రీనివాస్ రెనొవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామన్న. ఇనుగంటి రమావేంకటేశ్వరరావ్, గందె పద్మశ్రీనివాస్, గునిశెట్టి రవీందర్, చుక్క రవి, గుంపుల రమేశ్, వేముల నరేశ్, జైన రాజమౌళి, సురేందర్, సురేశ్ పర్యవేక్షిస్తున్నారు.
రాజన్న సన్నిధిలో..
ముక్కోటి ఏకాదశికి వేములవాడ రాజన్న క్షేత్రం ముస్తాబైంది. విద్యుద్దీప కాంతుల్లో ధగధగ మెరిసిపోతున్నది. ఆలయ ప్రాంగణాన్ని చాందినీ వస్ర్తాలు, తీరొక్క పూలు, అరటి తోరణాలతో అలంకరించినట్లు ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రాతఃకాలం 3 గంటల నుంచి 3-10 గంటల వరకు మంగళవాయిద్యాలు, 3-10 నుంచి 3-35 వరకు సుప్రభాతసేవ, 3-35 నుంచి 3-45 వరకు సుప్రభాత ద ర్శనం, 3-45 నుంచి 3-50 వరకు ఆలయశుద్ధి, 3-50 నుంచి 5 గంటలవరకు ప్రాతఃకాలపూజ, 5-10 గంటల నుంచి 5-25 వర కు స్వామివారి ఉత్తరద్వార దర్శనం, అనంతరం వేదస్వస్తి ఉంటుందని వెల్లడించారు. భక్తులకు అన్నిఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.