Ramagundam | కోల్ సిటీ, ఆగస్టు 7 : రామగుండంలో గడిచిన రెండేళ్లుగా కూల్చివేతలు తప్ప ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదనీ, పైగా బొమ్మా.. బొర్సు ఆటలతో కూల్చివేతలు జరుగుతున్నాయని రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ ఆరోపించారు. నగరంలోని ఎల్బీ నగర్ లో నిర్మాణంలోని షాపింగ్ కాంప్లెక్స్ గదులను కూల్చివేత సంఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. మొన్న తిలక్ నగర్, నేడు ఎల్బీ నగర్లో దుకాణాలు కూల్చివేసి ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు. రామగుండంలో దాగుడు మూతల రాజకీయాలు నడుస్తున్నాయనీ, నగర పాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల మౌనం వల్లే ఈ పరిస్థితులకు కారణమన్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు పేరుతో దుకాణాలు, ఇళ్లు కూల్చివేయడం, తర్వాత బాధితులకు స్థానిక ఎమ్మెల్యే అభయ హస్తంగా సింగరేణి స్థలాల్లో పునరావాసాలు నిర్మించి ఇస్తామని చెప్పడం, సింగరేణి, మున్సిపల్ అధికారులతో కలిసి భూమిపూజలు చేయడం, తీరా నిర్మాణాలు జరిగాక మళ్లీ మున్సిపల్ అధికారులు వచ్చి అనుమతులు లేవనీ, అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆ నిర్మాణాల ప్రారంభ సమయంలోనే అభ్యంతరాలు చెప్పకుండా బాధితులు వ్యయ, ప్రయాసాలకోర్చి దుకాణాలు నిర్మించుకున్నాక సింగరేణి, మున్సిపల్ అధికారులు వచ్చి కూల్చడం, తర్వాత ఎమ్మెల్యే వెళ్లి బాధితులను పరామర్శించడం చూస్తుంటే దాగుడు మూతల రాజకీయాల మాదిరిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కూల్చివేతలకు నగర పాలక కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలన్నారు. అలాగే ప్రధాన చౌరస్తా, శివాజీ నగర్, రాజేష్ థియేటర్, బస్టాండ్లలో నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లకు మున్సిపల్ అనుమతులు ఉన్నాయా అనేది కమిషనర్ బహిర్గతం చేయాలని స్పష్టం చేశారు. కూల్చివేతల రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతూ ఎంతకాలం పబ్బం గడుపుకుంటారని ప్రశ్నించారు.