కరీంనగర్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ వైపు వానలు కురుస్తుండగా..మరోవైపు ఈదురుగాలులతో జనం వణికిపోతున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆకాశంలో మబ్బులతో చీకట్లు అలుముకోగా, సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వానపడ్డది. కరీంనగర్ జిల్లాకేంద్రంలో సాయంత్రం భారీగా కురిసింది. వేంకటేశ్వరస్వామి బ్రహ్మాత్సవాల నేపథ్యంలో తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన శ్రీరాముడి పట్టాభిషేకం కటౌట్ కూలిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దాదాపు మూడు గంటలపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచి పోయింది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు ఒక్కో ఏరియాలో సరఫరాను పునరుద్ధరించారు. హుజూరాబాద్, వీణవంక మండలాల్లో వడగళ్ల వానతో మక్క, పల్లి, పత్తి పంటలకు కొంతమేర నష్టం వాటిల్లింది. శంకరపట్నం మండలం కొత్తగట్టులో సుమారు 2వేల కోడిపిల్లలు చనిపోయాయి. కరీంనగర్- వరంగల్ రహదారి కేశవపట్నం వద్ద భారీ చెట్టు కూలిపోయింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, కోనరావుపేట, వేములవాడ, బోయినపల్లిలో ఓ మోస్తారు వానపడ్డది. వీర్నపల్లి మండలంలో రాళ్ల వర్షం కురువడంతో మక్క నేలకొరిగింది. సిరిసిల్ల పట్టణంలోని మూడో వార్డులో భారీ వేప చెట్టు కూలిపోయింది. జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్, కోరుట్ల, మెట్పల్లి, కథలాపూర్, మల్యాల మండలాల్లో కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సారంగాపూర్ మండలం తాళ్లధర్మారంలో చెట్లు నేలకూలాయి. మల్యాల మండలం రాంపూర్ శివారులోని ఒర్రె వరదనీటితో ఉప్పొంగి ప్రవహించింది. జగిత్యాలజిల్లాకేంద్రంలో భారీ వర్షం పడడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
రాళ్లవాన.. జనం గజగజ..
ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా వడగళ్లు పడ్డాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో.. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం, మానకొండూర్ హుజూరాబాద్, సిర్సపల్లి, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డిపేట, ఇల్లందకుంట, వీణవంకలో వడగండ్ల వాన కురిసింది. చలికి వర్షం తోడు కావడం, ఈదురు గాలులు వీయడంతో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. పలుచోట్ల స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పత్తి, పల్లి, మక్క తదితర పంటలకు కొంతమేర నష్టం కలిగింది. కాగా, వర్షంతో నీటమునిగిన ప్రాంతాలను ప్రజాప్రతినిధులు, నాయకులు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసానిచ్చారు.
పరిశీలించిన మంత్రి గంగుల
వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన శ్రీరామ పట్టాభిషేకం భారీ కటౌట్ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా మంత్రి చర్యలు చేపట్టారు. మున్సిపల్ సిబ్బందితో దగ్గరుండి రోడ్డుపై పడిన కటౌట్ను తొలగింపజేశారు.