విద్యానగర్, సెప్టెంబర్ 24 : పేదలను దగా చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జిల్లాలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
డీఎంహెచ్వో జువేరియా ఆధ్వర్యంలో 35 హాస్పిటళ్లను తనిఖీ చేశాయి. ఆయాచోట్ల అనుమతులు ఉన్నాయా..? రిజిస్ట్రేషన్లు సక్రమంగానే ఉన్నాయా..? నిబంధనలు పాటిస్తున్నాయా..? వైద్యులు ఎవరెవరు ఉన్నారు? సర్టిఫికెట్లు సరైనవేనా..? తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. అనూహ్యంగా సర్కారు కొరఢా ఝులిపించేందుకు సిద్ధం కావడంతో నిర్వాహకులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు పాటించని దవాఖానల యాజమాన్యాలపై చర్యలు తప్పవని డీఎంహెచ్వో హెచ్చరించారు.